
2025 ఏడాది ఫస్టాఫ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సంక్రాంతికి రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా తప్ప పెద్దగా ఏదీ ఆడలేదు. `డాకు మహారాజ్`, `హిట్ 3`, `మ్యాడ్ 2`, `కోర్ట్`, `సింగిల్`, `కుబేర` వంటి సినిమాలు ఫర్వాలేదనిపించాయి.
అయితే ఈ ఏడాది ఫస్టాఫ్లో పెద్ద సినిమాలు లేకపోవడం మరో పెద్ద డిజప్పాయింట్మెంట్. ఈ క్రమంలో ఇప్పుడు ఆడియెన్స్ ఆశలన్నీ సెకండాఫ్పైనే ఉంది.
దీనికితోడు ద్వితీయార్థంలో భారీ సినిమాలు రాబోతుండటంతో వీటి కోసం సినీ ప్రియులు అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 2025లో బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించే చిత్రాలన్నీ మున్ముందు రాబోతుండటం విశేషం. ఆ సినిమాలేంటో చూద్దాం.
2025 ద్వితీయార్థం భారీ సినిమాలు పవన్ కళ్యాణ్తో ప్రారంభం కాబోతుంది. ఆయన హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` సినిమా జులై 24న విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్తో రాబోతున్న చిత్రమిది.
జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నారు. `శివుడు, విష్ణువు అవతారమైన వీరమల్లు` కథతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు నిర్మాత తెలిపారు.
దీనిపై భారీ అంచనాలున్నాయి. మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. మరి ఇది ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మరోవైపు జులై 31న విజయ్ దేవరకొండ నటించిన `కింగ్డమ్` రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మించారు.
భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. టీజర్, ట్రైలర్స్ తో ఆద్యంతం కట్టిపడేసింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్కిది భారీ మూవీగా ఉండబోతుంది. సినిమా కనెక్ట్ అయితే బాక్సాఫీసు షేక్ కావడం ఖాయమని చెప్పొచ్చు.
ఆగస్ట్ లో రెండు భారీ చిత్రాలు రాబోతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన `వార్ 2` రిలీజ్ కాబోతుంది.
హిందీలో తెరకెక్కిన ఈ మూవీని నాగవంశీ తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది.
తారక్, హృతిక్ కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. సినిమా బాగుంటే బాక్సాఫీసు దద్దరిల్లడం ఖాయమని చెప్పొచ్చు.
ఇదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కూలీ` రిలీజ్ అవుతుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ ఏడాది రాబోతున్న భారీ మల్టీస్టారర్గా ఈ మూవీ నిలిచింది.
లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. గోల్డ్ మాఫియా ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా బాగుంటే వెయ్యి కోట్లు ఈజీగా టచ్ చేస్తుందని చెప్పొచ్చు.
సెప్టెంబర్లో రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన మరో సినిమా `ఓజీ` సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముంబాయి గ్యాంగ్ స్టర్ ప్రధానంగా రూపొందింది.
ఇందులో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన గంభీరగా అలరించనున్నారు. సెప్టెంబర్లో మూవీ రాబోతుందని టీమ్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేసింది.
ఇందులో వర్షంలో తడుస్తూ కారు దిగి గన్ తో ఫైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా బాగుంటే బాక్సాఫీసుకి పూనకాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సెప్టెంబర్ 25నే బాలయ్య నటిస్తోన్న `అఖండ 2` రిలీజ్ కానుంది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వస్తోన్న నాలుగో చిత్రమిది. గతంలో `సింహ`, `లెజెండ్`, `అఖండ` చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
దీంతో `అఖండ 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పాన్ ఇండియా లెవల్లో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. శివతత్వం ఆధారంగా చేసుకుని రూపొందించిన మూవీ కావడంతో ఆ అంచనాలు బాగా పెరిగాయి.
ఈ మూవీ నార్త్ లో ఎక్కితే కలెక్షన్ల వర్షం కురిపించడం పక్కా. మరి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట రూపొందిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర` కూడా ఈ ఏడాదినే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఇది డిలే అవుతుంది.
ఆ విషయంలో క్లారిటీ వచ్చాక టీమ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇది అక్టోబర్లోగానీ, నవంబర్లోగానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్తో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
చిరంజీవి కూడా ఈ మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. తన కెరీర్లో మరో `జగదేక వీరుడు అతిలోక సుందరి` లాంటి మూవీ అవుతుందని భావిస్తున్నారు. మరి ఆ స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.
ఈ ఏడాది చివర్లో రాబోతున్న మరో బిగ్ మూవీ ప్రభాస్ నటిస్తోన్న `ది రాజాసాబ్`. డిసెంబర్ 5న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దర్శకుడు మారుతి ఈ మూవీని రొమాంటిక్ హర్రర్ ఫాంటసీగా రూపొందిస్తున్నారు.
ప్రభాస్ మొదటిసారి ఇలాంటి హర్రర్ మూవీ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ లో ఆసక్తి ఏర్పడింది. ఈ ఏడాదికి `ది రాజాసాబ్` గ్రాండ్గా ముగింపు పలుకబోతుందని చెప్పొచ్చు. ఈ మూవీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే వెయ్యి కోట్ల కలెక్షన్లు పక్కా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
దీంతో ఈ సినిమాలపై ఆడియెన్స్ లో, ఇండస్ట్రీలో భారీ అంచాలున్నాయి. మరి ఇవి ఆ అంచనాలను అందుకుని కాసుల వర్షం కురిపించి చిత్ర పరిశ్రమని, థియేటర్లని కళకళలాడిస్తాయా? అనేది చూడాలి.