Yuvraj Singh: లార్డ్స్‌లో యువరాజ్ సింగ్‌కు అరుదైన గౌరవం.. దిగ్గజాల క్లబ్‌లో చేరిన సిక్స్ సిక్సర్ కింగ్

Published : Jul 20, 2026, 09:01 AM IST

Yuvraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ లార్డ్స్ గ్రౌండ్ లో ప్రతిష్ఠాత్మక ఐదు నిమిషాల గంటను మోగించారు. భారత్-ఇంగ్లాండ్ 3వ వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ గౌరవం దక్కింది.

PREV
15
యువీ ఈజ్ బ్యాక్: సచిన్, గంగూలీల సరసన యువరాజ్ సింగ్

భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యున్నత గౌరవం దక్కింది. ఆదివారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌కు ముందు యువీ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.

25
లార్డ్స్ గంట మోగించిన సిక్స్ సిక్సర్ కింగ్

మూడో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు, క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ గ్రౌండ్ లోని ఐదు నిమిషాల బెల్‌ను యువరాజ్ సింగ్ మోగించాడు. ఈ వేడుక స్టేడియంలోని ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. 2011 వన్డే ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన యువీ, బౌలర్స్ రైటింగ్ రూమ్ వెలుపల ఉన్న ఐకానిక్ బెల్ దగ్గర నిలబడి ఈ సాంప్రదాయాన్ని పూర్తి చేశాడు.

ఈ సమయంలో యువరాజ్ చాలా స్టైలిష్ సూట్‌లో కనిపించాడు. అతని భార్య, నటి హజెల్ తో పాటు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) నిర్వాహకులు, సభ్యులు అతని వెనుక నిలబడి ఈ క్షణాన్ని వీక్షించారు. వెస్టిండీస్ లెజెండరీ ఆటగాళ్లు బ్రియాన్ లారా, క్లైవ్ లాయిడ్ కూడా ఈ వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి లార్డ్స్ కు వచ్చారు.

35
లార్డ్స్ బెల్ సాంప్రదాయం

లార్డ్స్ గ్రౌండ్ లో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగించే సాంప్రదాయం 2007 లో మొదలైంది. అంతర్జాతీయ క్రికెటర్లు, నిర్వాహకులు లేదా ప్రముఖ క్రీడాభిమానులను ఈ గంట మోగించడానికి ఆహ్వానిస్తారు.

45
యువీ రికార్డులు

లార్డ్స్ హోమ్ ఆఫ్ క్రికెట్‌లో యువీ కనిపించడంతో క్రికెట్ లవర్స్ కు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్ కేవలం 63 బంతుల్లో 69 పరుగులు చేసి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. 

యువీ తన అద్భుతమైన కెరీర్‌లో భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2007 టీ20 ప్రపంచ కప్ విజయంలో, అలాగే 2011 వన్డే ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్‌లో ఈ గౌరవం అందుకున్న ఏకైక భారతీయుడు యువీ మాత్రమే కాదు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజ భారత క్రికెటర్లు కూడా ఈ గంటను మోగించారు.

55
రోహిత్ సెంచరీ.. టీమిండియాకు బిగ్ షాక్

లార్డ్స్ లో జరిగిన ఉత్కంఠభరితమైన మూడో వన్డేలో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 387/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెన్ డకెట్ (141), జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74) రాణించారు. 

భారీ లక్ష్యచేధనలో భారత్ తరఫున రోహిత్ శర్మ (138), శుభ్‌మన్ గిల్ (77), విరాట్ కోహ్లీ (74) పోరాడినప్పటికీ, జట్టు 360/7 పరుగులకే పరిమితమైంది. సామ్ కరన్ 4 వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టాడు. 

ముఖ్యమైన రికార్డులు:

అత్యధిక స్కోరు: ఇంగ్లాండ్ చేసిన 387/3 స్కోరు లార్డ్స్ లో వన్డే చరిత్రలోనే అత్యధికం. అలాగే భారత్‌పై ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు.

బెన్ డకెట్ రికార్డు: డకెట్ (141) వన్డే కెరీర్‌లో భారత్‌పై మొదటి సెంచరీ నమోదు చేశాడు. అంతేకాకుండా, లార్డ్స్ లో  వివియన్ రిచర్డ్స్ (138*) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు.

భాగస్వామ్యం: డకెట్-బెథెల్ మధ్య నమోదైన 192 పరుగుల భాగస్వామ్యం లార్డ్స్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌గా రికార్డు సృష్టించింది.

లార్డ్స్ లో ఒకే వన్డే మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఈ మ్యాచ్‌తో నమోదైంది.

• 747 పరుగులు: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ (2026)

• 655 పరుగులు: ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా (2025)

• 651 పరుగులు: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ (2002)

• భారత్ రికార్డు స్కోరు: ఈ మ్యాచ్‌లో భారత్ చేసిన 360/7 స్కోరు, ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. 1999లో టాంటన్‌లో శ్రీలంకపై చేసిన 373/6 స్కోరు ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది.

• ఇంగ్లాండ్ లో రెండో అత్యధిక పరుగులు: ఈ మ్యాచ్‌లో నమోదైన 747 పరుగులు, ఇంగ్లాండ్‌లో జరిగిన ఒకే వన్డేలో నమోదైన రెండో అత్యధిక టోటల్ రికార్డు. 2015లో ఓవల్ మైదానంలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో నమోదైన 763 పరుగులు మొదటి స్థానంలో ఉంది.

• ఇంగ్లాండ్ సిరీస్ విజయం: 2019 తర్వాత (గడిచిన ఏడు సిరీస్‌లలో) భారత్ లేదా ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌కు ఇదే మొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం.

Read more Photos on
click me!

Recommended Stories