PBKS vs DC : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఉంచిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో ఛేదించి సంచలన విజయం సాధించింది. డబుల్ సెంచరీ పరుగులు చేసినా పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి కారణాలు ఏమిటి?
ధర్మశాలలో ఢిల్లీ దెబ్బ.. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు?
ధర్మశాలలో జరిగిన ఐపీఎల్ 55వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు ఊహించని షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 210 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ పరాజయంతో పంజాబ్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. పంజాబ్ ఓటమికి దారితీసిన ఐదు ప్రధాన కారణాలను గమనిస్తే..
26
అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ప్లేలోనే రాహుల్, పోరెల్, సాహిల్ పరాఖ్ పెవిలియన్ చేరారు. ఆ సమయంలో కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి జట్టును రేసులోకి తెచ్చాడు. అక్షర్ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
36
డేవిడ్ మిల్లర్ 'కిల్లర్' బ్యాటింగ్
అక్షర్ అవుట్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లో 51 పరుగులు చేసిన మిల్లర్, ఢిల్లీ విజయాన్ని దాదాపు ఖరారు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. మిల్లర్ అవుట్ అయ్యే సమయానికి ఢిల్లీకి విజయం చాలా దగ్గరైంది.
చేజారిన క్యాచ్లు.. పంజాబ్ ను దెబ్బకొట్టిన ఫీల్డింగ్
పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఈ మ్యాచ్లో అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఇచ్చిన సులువైన క్యాచ్లను పంజాబ్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. డీప్ స్క్వేర్ లెగ్ వద్ద శేడ్గే, లాంగ్ ఆన్ వద్ద అర్ష్దీప్ సింగ్ క్యాచ్లు వదిలేయడం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది.
56
బౌలింగ్ వైఫల్యం.. వెట్ బాల్ సమస్య
ధర్మశాలలో మంచు ప్రభావం వల్ల బంతి తడిగా మారింది. దీంతో పంజాబ్ బౌలర్లు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయారు. యశ్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో రెండు నో బాల్స్ ఇవ్వడంతో పాటు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ బౌలర్లు ముఖ్యంగా డెత్ ఓవర్లలో ప్లానింగ్ లేకుండా బౌలింగ్ చేశారని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా అంగీకరించాడు.
66
ఆశుతోష్ - మాధవ్ తివారీ మెరుపులు
చివరి ఓవర్లలో ఢిల్లీ విజయానికి వేగంగా పరుగులు అవసరమైన వేళ, ఆశుతోష్ శర్మ (10 బంతుల్లో 24), మాధవ్ తివారీ (8 బంతుల్లో 18) అదరగొట్టారు. స్టోయినిస్ వేసిన 18వ ఓవర్లో వీరు 19 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత యశ్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో ఆఖిబ్ నబీ సిక్సర్ బాది ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు.
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే 200 పైచిలుకు స్కోరును కాపాడుకోవడంలో అత్యధిక సార్లు (9 సార్లు) విఫలమైన జట్టుగా చెత్త రికార్డు సృష్టించింది. వరుస ఓటములు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టంగా మార్చాయి.