IPL 2025-CSK : ఐపీఎల్ 2025 కోసం 10 ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. రాబోయే ఐపీఎల్ సీజన్ కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. కాబట్టి ఐపీఎల్ రూల్స్ ప్రకారం జట్లలో చాలానే మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ప్లేయర్లలో కేవలం నలుగురిని మాత్రమే ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఏ జట్లు ఏ ప్లేయర్లను ఉంచుకుంటాయి... ఎవరిని వదులుకుంటారనేది క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ 2025కి ముందు ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వదులుకునే టాప్-5 ప్లేయర్ల లిస్టును గమనిస్తే.. క్రికెట్ వర్గాల టాక్ ప్రకారం ఇలా ఉన్నాయి..
శార్దూల్ ఠాకూర్
ముంబైకి చెందిన ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ గత సీజన్లో 9 మ్యాచ్లలో 5 వికెట్లు మాత్రమే తీశాడు. పరుగులు కూడా పెద్దగా లేవు. రూ.4 కోట్లతో దక్కించుకున్న అంచనాలను అందుకోవడంలో పెద్ద సక్సెస్ కాలేకపోయాడు. కాబట్టి సీఎస్కే శార్దూల్ ఠాకూర్ ను వదిలిపెట్టే అవకాశముంది.
మొయిన్ అలీ
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ 2024లో 8 మ్యాచ్ల్లో కేవలం 128 పరుగులు చేసి 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని చెన్నై టీమ్ మొయిన్ అలీని కూడా వదిలిపెట్టే అవకాశముంది.
డారిల్ మిచెల్
న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 14 కోట్లకు దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 2024లో అతని నుంచి కేవలం 318 పరుగులు, 1 వికెట్ మాత్రమే వచ్చాయి. భారీ ధరకు దక్కించుకున్న అతనిపై ప్రదర్శనతో సీఎస్కే సంతృప్తిగా లేదని చర్చ సాగుతోంది. కాబట్టి మిచెల్ ను కూడా ధోని టీమ్ చెన్నై వదిలించుకోనుందని టాక్.
దీపక్ చాహర్
రాజస్థాన్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు వేలంలో దక్కించుకుంది. అయితే గత 2 ఐపీఎల్ సీజనన్లలో అతను గాయాలతో పోరాడుతున్నాడు. దీపక్ చాహర్ ఐపీఎల్ 2024లో 8 మ్యాచ్లు మాత్రమే ఆడి 5 వికెట్లు తీశాడు. అంతకుముందు సీజన్ ఐపీఎల్ 2023లో అతను 10 మ్యాచ్ల్లో కనిపించాడు.
అజింక్య రహానే
ముంబై బ్యాటర్ అజింక్య రహానేను బేస్ ధర రూ. 50 లక్షలతో ఒప్పందంతో దక్కించుకుంది చెన్నై టీమ్. సీనియర్ ప్లేయర్ కావడంతో అతని నుంచి బిగ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలను ఆశించింది ధోని టీమ్. కానీ, అతని ప్రదర్శన ఐపీఎల్ 2024 లో పేలవంగా ఉంది. అజింక్య రహానే ఐపీఎల్ 2023లో 172 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 326 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కానీ 2024లో రహానే కేవలం 123 స్ట్రైక్ రేట్తో 242 పరుగులు మాత్రమే చేశాడు.