టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ గురువారం (జనవరి 20) 28వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. త్వరలోనే అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
తన చిన్ననాటి స్నేహితురాలు మేహాతో గురువారం రాత్రి అతడి నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం గురువారం రాత్రి జరిగింది. ఈ మేరకు అక్షర్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫోటోలను షేర్ చేశాడు.
కాబోయే భార్య మేహాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అక్షర్ ఇలా రాసుకొచ్చాడు..‘ఈ రోజు మా కొత్త జీవితానికి ఆరంభం.. ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను..’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ సందర్భంగా అక్షర్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా స్పిన్నర్, అక్షర్ సహచర ఆటగాడు యుజ్వేంద్ర చాహల్.. అతడికి శుభాకాంక్షలు తెలిపాడు.
అక్షర్ గుజరాత్ రంజీ టీమ్ మేట్ చింతన్ గజ కూడా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. శుభాకాంక్షలు చెప్పాడు.
భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్న ఈ గుజరాతీ ఆటగాడు.. గతేడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా టెస్టులలో అరంగ్రేటం చేశాడు. ఆ సిరీస్ లో ఏకంగా మూడు టెస్టులలోనే 27 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ విజృంభణతో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు.. 3-1 తేడాతో విజయం సాధించింది.
ఇక ఇటీవల స్వదేశంలో ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో కూడా అక్షర్ రాణించాడు. కానీ ఆ సిరీస్ లో గాయం కావడంతో దక్షిణాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు.
ఇప్పటివరకు కెరీర్ లో 5 టెస్టులాడిన అక్షర్.. 36 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. 38 వన్డేలలో 45 వికెట్లు పడగొట్టిన అక్షర్.. 15 టీ20లలో 12 వికెట్లు తీసుకున్నాడు.