ఓడినా సరే, జట్టును మార్చేదిలే... న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లోనూ మార్పులు లేకుండా భారత జట్టు...

First Published Oct 30, 2021, 2:59 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చారిత్రక పరాజయాన్ని నమోదుచేసుకుంది టీమిండియా. దీంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి ముందు జట్టులో మార్పులు అనివార్యం అనుకున్నారంతా. అయితే మాహీ మాత్రం తన పాత ఫార్ములానే ఫాలో అవుతున్నాడట..

జట్టుకి విజయాలు వచ్చినా, పరాజయాలు వచ్చినా జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా అదే టీమ్‌ను కొనసాగించడం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బాగా అలవాటు....

ఈ ఫార్ములా టీమిండియాకి కొన్ని విజయాలను అందించినా, పెద్దగా వర్కవుట్ కాకుండా బెడిసికొట్టిన మ్యాచులే ఎక్కువ. సీఎస్‌కే విషయంలోనూ ఈ ఫార్ములా బాగా వర్కవుట్ అయ్యింది...

అదే ఫార్ములాని టీ20 వరల్డ్‌కప్ 2021లోనూ అమలు చేయాలని అనుకుంటున్నాడు మెంటర్ ధోనీ. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ భువనేశ్వర్ కుమార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...

అలాగే హార్ధిక్ పాండ్యా ఫినిషర్ రోల్‌ను సరిగ్గా పోషించలేకపోయాడు. ఈ ఇద్దరి స్థానంలో శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు కోరారు...

అయితే మాహీ మాత్రం ఓడినా సరే, జట్టులో మార్పులు చేసేదిలే అంటున్నాడట... శార్దూల్ ఠాకూర్ బౌలర్‌గా ఓకే కానీ, హార్ధిక్ పాండ్యాలా ఫినిషర్ రోల్ పోషించలేడని ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు...

‘ఐపీఎల్ 2021 సీజన్‌లో ఒక్క బాల్ కోసం బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యాని సెలక్టర్లు, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ జట్టు నుంచి తప్పించి, స్వదేశానికి పంపించాలని అనుకున్నారు.

హార్ధిక్ పాండ్యా స్థానంలో ఫామ్‌లో ఉన్న ఓ యంగ్ ఆల్‌రౌండర్‌కి అవకాశం ఇవ్వాలని ఆశించారు. కానీ మాహీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. హార్ధిక్ పాండ్యా ఫినిషర్‌గా భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించాడు.

అతని అనుభవం టీమిండియాకి ఉపయోగపడుతుంది... అంటూ సెలక్టర్లకు నచ్చజెప్పాడంటూ’ మాజీ ఛీఫ్ సెలక్టర్ ఛేతన్ శర్మ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాయి...

న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, తన డిఫరెంట్ వేరియేషన్స్‌తో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతాడని, భువీ కరెక్టుగా ఫోకస్ బెడితే, అతన్ని ఎదుర్కోవడం వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా కష్టమేనంటూ ధోనీ అభిప్రాయపడుతున్నాడు...

అలాగే పాకిస్తాన్‌పై భారీగా పరుగులు సమర్పించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టగలడని టీీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది...

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని కానీ, శార్దూల్ ఠాకూర్‌ని కానీ ఆడించేందుకు టీమిండియా ఇష్టపడడం లేదని, పాకిస్తాన్‌తో ఆడిన జట్టునే, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగించవచ్చని సమాచారం...

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓడిన టీమిండియా, సెమీస్ రేసులో ఉండాలంటే న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ కూడా తొలి మ్యాచ్‌లో పాక్ చేతుల్లో ఓడడంతో కివీస్‌కి కూడా ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది...

click me!