IND vs PAK : పాకిస్థాన్ పై భారత్ అద్భుత విజయానికి.. టాప్ రీజన్స్ ఇవే

Published : Feb 16, 2026, 09:12 AM ISTUpdated : Feb 16, 2026, 09:34 AM IST

టీ20 ప్రపంచకప్ 2026 లో టీమిండియా మరోసారి అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసి సూపర్ 8లో అడుగుపెట్టింది. హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా విజయానికి కారణమైన టాప్ అంశాలేంటో ఇక్కడ చూద్దాం. 

PREV
15
పాక్ పై టీమిండియా విజయం

IND vs PAK : ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇండియా, ఇండియా అనే నినాదాలతో మారుమోగింది. 100 కోట్లకు పైగా భారతీయులు సంబరాల్లో మునిగితేలేలా దాయాది పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2026 లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సూర్య సేన సూపర్ 8 లోకి అడుగుపెట్టేసింది. 

పాకిస్థాన్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది... ఓపెనర్ ఇషాన్ కిషన్ 77 పరుగులతో చెలరేగడంతో ఈ స్కోరు సాధ్యమయ్యింది. ఈ పరుగులను కాపాడుకోవడంతో బౌలర్లు సఫలమయ్యారు... పాక్‌ను కేవలం 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూల్చారు. వరుణ్ చక్రవర్తి (2/17), అక్షర్ పటేల్ (2/29), హార్దిక్ పాండ్యా (2/16), జస్ప్రీత్ బుమ్రా (2/17) కలిసి 8 వికెట్లు పడగొట్టి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఇలా కొలంబోలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన ఈ ఘనవిజయంలోని కీలక అంశాలేంటో చూద్దాం.

25
అభిషేక్ పని ఇషాన్ కానిచ్చేశాడు..

కడుపు నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. అతని రాకపై భారీ అంచనాలు నెలకొన్నాయి… పాకిస్థాన్ బౌలర్లను చితక్కొడతాడని అభిమానులు ఊహించారు. కానీ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పిన్ బౌలింగ్‌లో కేవలం నాలుగు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులను నిరాశపర్చాడు. ఈ టోర్నీలో అతనికి ఇది వరుసగా రెండో డకౌట్ కావడం గమనార్హం.

అభిషేక్ శర్మ ఔటైనా ఇషాన్ కిషన్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. తన మెరుపు బ్యాటింగ్‌తో పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు… టీమిండియాకు అదిరిపోయే ఆరంభం అందించాడు. ఈ టోర్నీలో ఇషాన్ కి ఇది రెండో హాఫ్ సెంచరీ. 

మొత్తంగా 40 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్. అతడు 192.50 స్ట్రైక్ రేట్‌తో అదరగొట్టాడు. తిలక్ వర్మతో కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు… ఇందులో 87.36% పరుగులు ఇషాన్ చేసినవే కావడం విశేషం.

35
పాక్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచిన బుమ్రా, హార్దిక్

175 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఆశలు తొలి రెండు ఓవర్లలోనే ఆవిరయ్యాయి. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా తమ పదునైన బౌలింగ్‌తో పాక్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. మొదట హార్దిక్ పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌ను డకౌట్ చేయగా తర్వాత బుమ్రా ఒకే ఓవర్లో సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘాలను పెవిలియన్ పంపాడు. దీంతో పాకిస్థాన్ రెండు ఓవర్లకే 13/3 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. 4.5 ఓవర్లకి 34/4కి, డెత్ ఓవర్లకి ముందు 97/9కి కుప్పకూలింది.

45
కెప్టెన్ స్మార్ట్ వ్యూహం

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం వెనుక ఉన్న మరో కీలక అంశం స్మార్ట్ వ్యూహం. స్పిన్‌కు బాగా అనుకూలించిన ఈ పిచ్‌పై బౌలర్లను తెలివిగా మార్చారు. తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి పార్ట్‌టైమ్ స్పిన్నర్లతో సహా మొత్తం ఏడుగురు బౌలర్లను ప్రయోగించి పాక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కలిసి నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. పేసర్లు, స్పిన్నర్ల సమష్టి కృషితో పాక్‌పై ఒత్తిడి పెంచారు.

55
పాకిస్థాన్ పై భారత్ కు అతిపెద్ద విజయమిదే..

టీ20 చరిత్రలో పాకిస్థాన్‌పై పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఈ 61 పరుగుల గెలుపుతో టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో పాక్‌తో 9 సార్లు తలపడగా, భారత్ 8 సార్లు గెలిచింది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు రెండూ కలిపి చూస్తే పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 16-1గా ఉంది. ఇది ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్ ఆధిపత్యానికి నిదర్శనం.

Read more Photos on
click me!

Recommended Stories