స్వదేశంలో ఇంగ్లాండ్ ను టీ20లతో పాటు వన్డేలలో ఓడించిన టీమిండియా ప్రస్తుతం కరేబియన్ దీవులకు వెళ్లింది. అయితే ఇంగ్లాండ్ తో రెండ్రోజుల క్రితం ముగిసిన మూడో వన్డేలో భారత జట్టుకు విజయాన్ని అందించిన రిషభ్ పంత్-హార్ధిక్ పాండ్యాల జోడీపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.
పంత్-పాండ్యాలు చివరి వన్డేలో అద్భుతంగా ఆడారని.. ఈ ఇద్దరూ గతంలో దిగ్గజ జోడీగా పేరొందిన యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోనీలను గుర్తుకు తెచ్చారని గవాస్కర్ కొనియాడాడు. వాళ్లలాగే సిక్సర్లు కొట్టడంతో పాటు నిలకడగా రాణించేగలిగే సత్తా వీరికి ఉందని తెలిపాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘అవును.. హర్ధిక్-పంత్ లు భవిష్యత్ లో తప్పకుండా యువరాజ్-ధోని జోడీని మరిపిస్తారు. ఈ ఇద్దరూ సిక్సర్లు కొట్టడంతో పాటు వికెట్ల మధ్య పరిగెత్తుతూ ఇన్నింగ్స్ చివరివరకు ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాళ్లు..’అని ప్రశంసించాడు. గతంలో ధోని-యువరాజ్ లు చాలామ్యాచులలో విజయాలు సాధించిపెట్టిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్ తో మూడో వన్డేలో భారత జట్టు 35 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన దశలో పంత్-పాండ్యా జోడీ ఐదో వికెట్ కు 133 పరుగులు జోడించారు. ఫలితంగా మూడో వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది.
ఇక హార్ధిక్ తిరిగి జట్టులోకి వచ్చి బౌలింగ్ లో కూడా రాణిస్తుండటం.. అతడికి తోడుగా రవీంద్ర జడేజా కూడా మెరుగ్గా ఆడుతుంటంతో రాబోయే టీ20, వన్డే ప్రపంచకప్ లలో ఈ ఇద్దరూ కీలకంగా మారతారని గవాస్కర్ అన్నాడు.
‘భారత జట్టు ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్న సమయంలో హార్ధిక్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అతడిప్పుడు పది ఓవర్లు బౌలింగ్ చేయగలడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా బ్యాటింగ్ తో పాటు పది ఓవర్ల బౌలింగ్ చేసే సత్తా కలిగిన ఆటగాడు.
ఈ ఇద్దరూ రాణిస్తుండటంతో భారత్ బలం పెరిగింది. 1983 వన్డే ప్రపంచకప్, 1985 వరల్డ్ ఛాంపియన్షిప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత జట్టు రాణించి టైటిల్ నెగ్గడానికి కారణం ఆల్ రౌండర్లే..’ అని సన్నీ చెప్పాడు.