ఐపీఎల్‌ స్పాట్ ఫిక్సింగ్‌లో ధోనీ హస్తం ఉందంటూ ఆరోపణలు... ఐపీఎస్ అధికారిపై కేసు వేసిన మాహీ...

First Published Nov 5, 2022, 2:02 PM IST

ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసు ఇప్పటికీ ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్న శ్రీశాంత్ కెరీర్‌ని నాశనం చేసిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం, మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్‌పై కూడా మరకలు పడేలా చేసింది. 2013లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం తీగలు ఇప్పటికీ కదులుతూనే ఉన్నాయి...

2013 ఐపీఎల్ సమయంలో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ కేసును ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ దర్యాప్తు చేశాడు. శ్రీశాంత్‌తో పాటు స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న ఆరుగురు క్రికెటర్లను అరెస్ట్ చేసిన సంపత్ కుమార్, మాహీకి కూడా దీంతో సంబంధం ఉందని చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాయి...

2013 ఐపీఎల్ మ్యాచుల సమయంలో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగుల్లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా పాలుపంచుకున్నాడని ఆరోపణలు చేశాడు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్. ఈ వ్యాఖ్యల తర్వాత సంపత్ కుమార్‌తో పాటు మరో ప్రైవేటు టీవీ ఛానెల్‌పై  మద్రాస్ హై కోర్టులో ‘పరువు నష్టం’ దావా వేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ధోనీ పిటిషన్‌ని స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, స్పాట్ ఫిక్సింగ్ కేసులో సంపత్ కానీ, ఇతర వ్యక్తులు, ఛానెళ్లు కానీ  మాహీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయరాదని, ఆరోపణలు చేయకూడదని తీవ్రంగా హెచ్చరించింది. అయితే 2021లో సంపత్, ఈ పరువు నష్టం పిటిషన్‌ని కొట్టేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు...

ఈ పరువునష్టం కేసు వేసి, స్పాట్ ఫిక్సింగ్ కేసులో సంచలన నిజాలు బయటపెట్టకుండా మద్రాస్ హై కోర్టు తన నోరు కుట్టేసిందని రాతపూర్వకంగా కోరాడు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్. దీనిపై విచారణ జరుగుతుండగానే తాజాగా ధోనీ.. సంపత్ వినతిని తిరస్కరించాల్సిందిగా ‘ధిక్కార’ కేసు వేశాడు... 

ఐపీఎస్ అధికారి ఇచ్చిన పిటిషన్‌లో చేసిన వ్యాఖ్యలు, తన గౌరవానికి, పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ ఆరోపణలు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసు గురించి మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది...

‘2013 నా జీవితంలో చాలా క్లిష్టమైన ఏడాది. ఆ ఏడాది స్పాట్ ఫిక్సింగ్ కేసు ఉదంతంతో చాలా నిరుత్సాహానికి గురయ్యాను. అంతకుముందు 2007 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీలో ఇండియా ఓడినప్పుడు కూడా అంత బాధపడలేదు. ఎందుకంటే ఆ టోర్నీలో మేం సరిగ్గా ఆడలేదు...

2013 మాత్రం పూర్తిగా విరుద్ధం. జనాలంతా స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ గురించే మాట్లాడేవాళ్లు. అసలు ఎక్కడ తప్పు జరిగిందో కూడా అర్థం కాలేదు. మాక్కూడా శిక్ష పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండేళ్లు నిషేధం విధించారు.. కెప్టెన్‌గా నా టీమ్ ఏ తప్పు చేసిందో నాకు అర్థం కాలేదు... మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మర్డర్ చేయడం కంటే పెద్ద నేరం’ అంటూ పాత ఇంటర్వ్యూల్లో కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ... 

click me!