
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్పై 336 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్ట్లో లీడ్స్లో ఇంగ్లాండ్ గెలిచి 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా, ఈ విజయంతో భారత్ సమం చేసింది.
ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ రెండోసారి చరిత్రను రాసాడు. మొదటి ఇన్నింగ్స్లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు చేయడం ద్వారా ఒకే టెస్ట్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసి సునీల్ గవాస్కర్ తర్వాత రెండవ భారత ఆటగాడిగా నిలిచాడు.
అంతేకాకుండా, గిల్ ఎడ్జ్బాస్టన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి భారత కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్లు సైతం ఇక్కడ భారత్ కు విజయాన్ని అందించలేకపోయారు. విరాట్ కోహ్లీ, ధోనిలు సైతం భారత్ ను ఈ గ్రౌండ్ లో గెలిపించలేకపోయారు.
ఈ మైదానంలో ఇప్పటివరకు చాలా మంది భారత కెప్టెన్లకు విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం 1986లో కపిల్ దేవ్ నేతృత్వంలో మ్యాచ్ డ్రా చేయగలిగారు. మిగిలిన అన్ని మ్యాచ్లలో భారత్ ఓటమి చవిచూసింది.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (269 పరుగులు), రవీంద్ర జడేజా (89 పరుగులు), యశస్వి జైస్వాల్ (87 పరుగులు) రాణించారు.
ఇంగ్లాండ్ 407 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జేమీ స్మిత్ (184* పరుగులు), హ్యారీ బ్రూక్ (158 పరుగులు) ఇంగ్లాండ్ బ్యాటింగ్ భారాన్ని మోశారు. భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. గిల్ 161 పరుగులు, జడేజా 69 పరుగులు నాటౌట్, పంత్ 65 పరుగులు, కేఎల్ రాహుల్ 55 పరుగులతో రాణించారు.
దీంతో భారత్ ఇంగ్లాండ్కు 608 పరుగుల లక్ష్యం ఉంచింది. ఛేదనలో 271 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. జేమీ స్మిత్ 88 పరుగులతో పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలింగ్లో ఆకాష్ దీప్ 6 వికెట్లు పడగొట్టాడు.
మొదటి ఇన్నింగ్స్లో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చాడు. అలాగే, ఆకాష్ దీప్ 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో ఆకాష్ దీప్ మరోసారి చెలరేగి 6 వికెట్లు సాధించాడు. ఈ ప్రదర్శనతో అతను మొత్తం 10 వికెట్లతో మ్యాచ్ను ముగించాడు. బ్యాటింగ్ లో గిల్ దుమ్మురేపితే.. బౌలింగ్ లో ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు.
శుభ్మన్ గిల్ ఈ విజయంతో తన నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించాడు. ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజాలు సాధించలేకపోయిన విజయాన్ని సాధించి, భారత్ టెస్ట్ చరిత్రలో ఓ మైలురాయిని నెలకొల్పాడు. ఇప్పుడు మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. అక్కడ కూడా విజయం సాధించాలని భారత్ ఉత్సాహంగా ఉంది.