రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌కి ఏడేళ్లు... ఆరోజు ఊతప్ప స్థానంలో ధోనీ ఉండి ఉంటే...

First Published Nov 13, 2021, 11:00 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌‌కి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ. టీమ్‌కి వస్తూ, పోతూ ఉన్న సమయంలో రోహిత్‌కి టీమ్‌కి పర్మినెంట్ ప్లేస్ దక్కేలా చేసిన ఇన్నింగ్స్‌ల్లో ఒకటి 2013, నవంబర్ 2న చేసిన డబుల్ సెంచరీ...

అసలు 300 బంతులుండే వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీయే సాధ్యమేనా అనుకుంటున్న రోజుల్లో ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదటి డబుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు...

గురువు వెనకే తాను అంటూ సచిన్ సహచర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాతే అసలు సిసలు ‘హిట్ మ్యాన్’ ఎంట్రీ ఇచ్చాడు...

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ బాదడమే కష్టం అనుకుంటున్న సమయంలో ఏకంగా మూడుసార్లు ఈ ఫీట్ సాధించాడు రోహిత్ శర్మ. 2013, నవంబర్ 2న ఆస్ట్రేలియాపై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై మొట్టమొదటిసారి డబుల్ సెంచరీ బాదాడు రోహిత్ శర్మ.

నవంబర్ 13న, 2014లో కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్‌లో శ్రీలంకతో జరిగిన వన్డేల్లో అసాధ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు హిట్ మ్యాన్... 173 బంతుల్లో 33 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 264 పరుగులు చేశాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... ఈ ఇన్నింగ్స్‌కి నేటికి ఏడేళ్లు.

ఈ ఇన్నింగ్స్‌లో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... హాఫ్ సెంచరీ మార్క్ అందుకునేందుకు 72 బంతులు తీసుకున్న రోహిత్ శర్మ, ఆ తర్వాత 28 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

ఆ తర్వాత 100 నుంచి 150 చేరుకునేందుకు తర్వాతి 25 బంతులు తీసుకున్న రోహిత్... 151 బంతుల్లో డబుల్ సెంచరీ మార్కును చేరుకున్నాడు.

ఆ తర్వాత 200 నుంచి 250 మార్కు చేరుకునేందుకు కేవలం 15 బంతులు మాత్రమే తీసుకున్నాడు రోహిత్ శర్మ... మొత్తంగా 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ... 50వ ఓవర్ ఆఖరి బంతికి కులశేఖర బౌలింగ్‌లో జయవర్థనేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 64 బంతుల్లో 6 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. ఇది ఈ మ్యాచ్‌లో రెండో అత్యుత్తమ స్కోరు. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌కి, సెకండ్ టాప్ స్కోరర్‌కి మధ్య 198 పరుగుల తేడా ఉండడం వన్డే క్రికెట్ చరిత్రలో ఓ రికార్డు...

సురేశ్ రైనా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్‌కి పరోక్షంగా కారణమయ్యాడు. సచిన్ డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ఎమ్మెస్ ధోనీ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సచిన్‌కి స్ట్రైయిక్ ఇవ్వకుండా ప్రేక్షకులను టెన్షన్ పెట్టాడు..

అయితే రోహిత్ శర్మ ఉన్న ఫామ్‌ను అర్థం చేసుకున్న రాబిన్ ఊతప్ప 16 బంతుల్లో 16 సింగిల్స్ తీశాడు. తాను ఎదుర్కొన్న ప్రతీ బంతికి సింగిల్ తీసి రోహిత్ శర్మకి స్ట్రైయిక్ ఇచ్చాడు. ఇదే రోహిత్‌ ఈ రేంజ్ స్కోరు చేయడానికి కారణమైంది.

రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప మధ్య కేవలం 9.4 ఓవర్లలోనే 128 పరుగుల భాగస్వామ్యం నమోదైంది... ఇందులో ఊతప్ప చేసింది 16 పరుగులే, వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదో రికార్డు...

నవంబర్ 13న వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ, మూడో డబుల్ సెంచరీని కూడా 13వ తేదీనే నమోదుచేశాడు. డిసెంబర్ 13, 2017లో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ బాదాడు రోహిత్ శర్మ...

శ్రీలంక క్రికెట్ అనాలసిస్ట్ డానియల్ అలెగ్జాండర్, ఆ రోజు మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అవుతాడని ట్వీట్ వేశాడు. అదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ, అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు..

కేవలం బౌండరీల ద్వారా (33 ఫోర్లు, 9 సిక్సర్లు) 186 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యధికం. మళ్లీ ఇన్నాళ్లకు నవంబర్ 17న పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు రోహిత్ శర్మ...

click me!