రిష‌బ్ పంత్ దెబ్బ‌కు ధోని రికార్డు బద్దలు - బెంగ‌ళూరులో సూప‌ర్ షో

First Published Oct 19, 2024, 3:28 PM IST

Rishabh Pant-MS Dhoni: బెంగుళూరు టెస్టు లో భార‌త తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫ‌ల‌మైంది కానీ, రెండో ఇన్నింగ్స్ లో అద్భుత‌మైన ఫైట్ బ్యాక్ చేస్తోంది. విరాట్, రోహిత్ శర్మలు హాఫ్ సెంచ‌రీలు చేయ‌గా, స‌ర్ఫార‌జ్ ఖాన్, రిషబ్ పంత్ సెంచ‌రీలు కొట్టారు. 

Rishabh Pant, Pant

Rishabh Pant-MS Dhoni: న్యూజిలాండ్‌తో బెంగళూరులోని ఎం చిన్న‌స్వామి స్టేడియంలో టెస్టులో భారత క్రికెట్ జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 46 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో స‌మిష్టిగా రాణిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అంద‌రూ ప్లేయ‌ర్లు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. 

న్యూజిలాండ్ 402 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. మూడో రోజు అద్భుత ఆట ఆడిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో మెరుపువేగం ప్రదర్శించింది. ఇది మ్యాచ్ నాలుగో రోజైన శనివారం (అక్టోబర్ 19) కూడా కొనసాగింది. లంచ్ సమయానికి భారత్ 344/3 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు 77 ప‌రుగుల లీడ్ లో ఉంది. 

సర్ఫరాజ్ ఖాన్, రిష‌బ్ పంత్ సెంచరీ భాగస్వామ్యం

రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (52), విరాట్ కోహ్లీ (70) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాకు బలమైన పునాది వేశారు. సర్ఫరాజ్‌ఖాన్‌, రిషబ్‌ పంత్ ఆ త‌ర్వాత భార‌త ఇన్నింగ్స్ ను మ‌రింత ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఈ మ్యాచ్‌లో భారత్‌కు పునరాగమనం చేశారు.

నాలుగో రోజు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 150 ప‌రుగులు చూసి ఔట్ అయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో  స‌ర్ఫ‌రాజ్ ఖాన్  18 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. రిష‌బ్ పంత్ లంచ్ స‌మ‌యానికి హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. పంత్ తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో ప‌లు రికార్డులు సాధించాడు.  ఆ తర్వాత తన హాఫ్ సెంచరీని సెంచరీగా దిశగా వెళ్లాడు కానీ, ఒక్క పరుగుదూరంలో సెంచరీని కోల్పోయాడు. 

Latest Videos


ధోనిని అధిగ‌మించిన రిష‌బ్ పంత్‌

బెంగ‌ళూరులో న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ 50 ప‌రుగులు పూర్తి చేసిన త‌ర్వాత మ‌రో క్రికెట్ రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన భారత వికెట్‌కీపర్‌గా పంత్ నిలిచాడు. కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే అత‌ను ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది.

ధోని 69 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు సృష్టించాడు. కాగా, ఫరూక్ ఇంజనీర్ 82 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. మోకాలి గాయం కారణంగా పంత్ మూడో రోజు బ్యాటింగ్ కు రాలేదు. ఒకరోజు విశ్రాంతి తీసుకున్న అతను నాలుగో రోజు బ్యాటింగ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ చేశాడు.

టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2500 పరుగులు చేసిన భారత వికెట్ కీపర్లు

62 ఇన్నింగ్స్‌లు - రిషబ్ పంత్
69 ఇన్నింగ్స్‌లు - మహేంద్ర సింగ్ ధోని
82 ఇన్నింగ్స్‌లు - ఫరూక్ ఇంజనీర్

పంత్ తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో మరో ఘనతను సాధించాడు. అతను అత్యధిక ఇన్నింగ్స్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ భారతీయ వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను తన టెస్టు కెరీర్‌లో 18వ సారి 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. పంత్ 62వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో అతను ఫరూక్ ఇంజనీర్‌తో సమానం. ఇంజనీర్ 87 ఇన్నింగ్స్‌లలో 18 సార్లు ఇలా చేశాడు. ఈ విషయంలో ధోనీ నంబర్-1 స్థానంలో ఉన్నాడు. అతను 144 ఇన్నింగ్స్‌ల్లో 39 సార్లు టెస్టుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు.

టెస్టుల్లో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన భారత వికెట్ కీపర్లు

39 - మహేంద్ర సింగ్ ధోనీ (144 ఇన్నింగ్స్‌లు)
18 - ఫరూక్ ఇంజనీర్ (87 ఇన్నింగ్స్‌లు)
18 - రిషబ్ పంత్ (62 ఇన్నింగ్స్‌లు)
14 - సయ్యద్ కిర్మాణీ (124 ఇన్నింగ్స్‌లు)

ఒక్కపరుగు దూరంలో సెంచరీ కోల్పోయిన రిషబ్ పంత్ 

రిషబ్ పంత్ ఒక్క పరుగు దూరంలో తన సెంచరీని కోల్పోయాడు. 99 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో 90+  పరుగుల వద్ద అత్యధిక ఔట్‌లు అయిన ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

10 - సచిన్ టెండూల్కర్
9 - రాహుల్ ద్రవిడ్
7 - రిషబ్ పంత్
5 - సునీల్ గవాస్కర్
5 - ఎంఎస్ ధోని
5 - వీరేంద్ర సెహ్వాగ్

ఇక రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ మాత్రమే 90+ పరుగుల వద్ద ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు టెస్టుల్లో అవుట్ అయిన వికెట్ కీపర్లుగా ఉన్నారు.

click me!