కీలక పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్..? సౌతాఫ్రికా టూర్ కు ఆ నలుగురు క్రికెటర్లు దూరం..!

First Published Dec 8, 2021, 1:11 PM IST

India Tour Of South Africa: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్..? కీలక టూర్ కు ముందు నలుగురు కీ ప్లేయర్లు ఈ  టూర్ కు  దూరం కానున్నట్టు  సమాచారం. గాయాల కారణంగా ఆ నలుగురు ఆటగాళ్లు.. సౌతాఫ్రికా టూర్ కు దూరంగా ఉండే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 

త్వరలో దక్షిణాఫ్రికాకు వెళ్లనున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.  కీలక పర్యటనకు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్నది. సౌతాఫ్రికా టూర్ కు ముందు భారత జట్టులోని నలుగురు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. 

ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్, స్పిన్నర్ అక్షర్ పటేల్, పేసర్ ఇషాంత్ శర్మ. ఈ నలుగురు ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. 

ఇటీవలే న్యూజిలాండ్ తో ముగిసిన రెండో టెస్టులో గాయం కారణంగా రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు తప్పుకున్న విషయం తెలిసిందే. కాన్పూర్ టెస్టులో ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు గాయాలయ్యాయి. జడేజా కుడి ముంజేతికి గాయమైంది. ఈ క్రమంలో అతడికి  వైద్య పరీక్షలు నిర్వహించగా.. గాయం తీవ్రతరం కావడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. 

ఒకవేళ అతడు శస్త్ర చికిత్స కు వెళ్లాల్సి వస్తే అది భారత జట్టుకు భారీ షాకే.  వచ్చే ఐపీఎల్ సీజన్ లో కూడా అతడు పాల్గొనే అవకాశం ఉండదు. జాతీయ జట్టుకు కూడా సుదీర్ఘకాలం పాటు విశ్రాంతినివ్వాల్సిందే. 

అతడితో పాటు  ఓపెనర్ శుభమన్ గిల్ కూడా కాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు కూడా సౌతాఫ్రికాకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఆగస్టులో ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా గిల్.. ఇదే  గాయంతో పర్యటన నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత జట్టు.. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తో ఓపెనింగ్ చేయించాల్సి వచ్చింది. 

ఈ ఇద్దరే గాక.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడు కూడా సిరీస్ కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముంబై టెస్టులో అతడు ఆడకపోవడంతో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్  ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 

మరోవైపు స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా స్ట్రెస్ రియాక్షన్ (కీళ్ల నొప్పులు)తో బాధపడుతున్నాడు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అక్షర్ కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో అతడు కూడా సౌతాఫ్రికా టూర్ కు అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది. 

కీలక ఆటగాళ్లు దూరమవుతుండటంతో జట్టు ఎంపిక కూడా ఆలస్యమయ్యే అవకాశమ కనిపిస్తున్నది. ఒకవేళ ఈ నలుగురు  పర్యటనకు వెళ్లకుంటే.. ఇప్పటికే సౌతాఫ్రికా లో అనధికారిక టెస్టులు ఆడుతున్న  ఇండియా-ఏ లోని షాబాజ్ నదీం, సౌరభ్ కుమార్ ను అక్కడే ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించనుంది. 

ఇక వారం రోజుల పాటు ఆలస్యంగా దక్షిణాఫ్రికాకు వెళ్లనున్న టీమిండియా.. ఈనెల 16న ముంబై నుంచి బయల్దేరే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లను ముంబైకి రమ్మన్న బీసీసీఐ.. వారిని  బయో బబుల్ లో ఉండాలని ఆదేశించింది. 12 నుంచి బయో బబుల్ లో ఉండే ఆటగాళ్లు.. 16న సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కనున్నారు. 

భారత పర్యటన నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఇప్పటికే 21 మందితో కూడిన టెస్టు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 26న తొలి టెస్టు మొదలుకానున్నది.  

click me!