ఐపీఎల్ - 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి జోరుగా చర్చ సాగింది. ఈ సీజన్ ధోనికి చివరిదని.. 2023 తర్వాత అతడు రిటైర్ అవడం పక్కా అని వాదనలు వినిపించాయి. ఐపీఎల్-2023 సందర్భంగా పలువురు కామెంటేటర్లు అడిగని ప్రశ్నలకు కూడా ధోని కూడా అస్పష్టమైన సమాధానాలే చెప్పాడు.
ఫైనల్ మ్యాచ్ లో కూడా ధోని తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. ‘రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే బెస్ట్ టైమ్ కానీ కేవలం థ్యాంక్యూ అన్న మాట చెప్పి తప్పుకోవడం సరికాదు. అయితే వచ్చే ఏడాది నేను ఆడతానా లేదా..?అన్నది నా శరీరం సహకరించేదానిపై ఆధారపడి ఉంది. అయినా ఐపీఎల్ - 2024 మినీ వేలానికి ఇంకా 9 నెలల సమయముంది. ఆ లోపు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా..’ అని చెప్పాడు.
ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ధోని మోకాలికి శస్త్ర చికిత్స తీసుకున్నాడు. కాలికి గాయంతోనే ధోని 16 మ్యాచ్ లు ఆడి తన టీమ్ కు ఐదో టైటిల్ అందించాడు. ప్రస్తుతం అతడు రికవరీ అవుతున్నాడు. మరి ఇప్పుడు ధోని తర్వాతి సీజన్ లో ఆడతాడా..? లేదా..? అనే చర్చ మొదలైంది.
దీనికి చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ’ధోని ప్రస్తుతానికైతే విశ్రాంతి తీసుకుంటున్నాడు. వచ్చే సీజన్ గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ధోనీ లక్ష్యాలు , వాటిని సాధించడానికి ఉత్తమమైన మార్గాలేంటో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. మేమైతే ధోని వచ్చే సీజన్ లో అతడు అందుబాటులో ఉంటాడనే అనుకుంటున్నాం..’అని చెప్పుకొచ్చాడు.
డిసెంబర్ లేదా జనవరిలో ఐపీఎల్ - 2024 కు మినీ వేలం జరిగే అవకాశముంది. ఆలోపు ధోని తన ఫిట్ గా ఉండి శరీరం సహకరిస్తే మరో సీజన్ లో కూడా అతడిని చూడొచ్చు. అయితే దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ వచ్చే
సీజన్ లో ఆడితే మాత్రం అది సీఎస్కేతో పాటు ఐపీఎల్ ఫ్యాన్స్ కూ పండుగే..