
మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి రోజున భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలతో జట్టు పరువు నిలిపారు.
ఇద్దరూ కలసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ఈ ఫలితం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. మ్యాచ్ డ్రా చేయాలని ఇంగ్లండ్ ప్రయత్నించినా, భారత్ గట్టి సమాధానం ఇచ్చింది.
తొలి ఇన్నింగ్స్లో వెనుకబడిన భారత్, రెండో ఇన్నింగ్స్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ 143 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తూ 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీతో అద్భుత ఆరంభం ఇచ్చాడు.
అనంతరం కేఎల్ రాహుల్ 90 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మ్యాచ్ ను ఇంగ్లాండ్ నుంచి పూర్తిగా దూరం చేసింది మాత్రం రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్.
జడేజా, వాషింగ్టన్ సుందర్ లు 90ల్లో ఉన్న సమయంలో, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు. మ్యాచ్ ఫలితం అప్పటికే మారిందన్న అభిప్రాయంతో అతను అంపైర్ల వద్దకు వెళ్లి కరచాలనం చేయాలనుకున్నాడు.
అయితే జడేజా, సుందర్ తమ సెంచరీలకు దగ్గరగా ఉన్నారు. వారి సెంచరీలను అడ్డుకోవాలని స్టోక్స్ ప్లాన్ ను భారత్ పసిగట్టింది. మ్యాచ్ ఇంకా మిగిలి ఉండటంతో డ్రా ప్రతిపాదనను ఈ జోడీ తిరస్కరించింది.
బెన్ స్టోక్స్ డ్రా ఆఫర్ను తిరస్కరించడంపై ఆశ్చర్యానికి గురయ్యాడు. భారత జట్టు నిర్ణయాన్ని చూసి అతడి ముఖంలో నిరాశ కనిపించింది. అంపైర్లు, బ్యాటర్లతో చర్చ జరిగిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని మార్చలేదు.
చివరికి జడేజా సిక్స్తో తన సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా బౌండరీతో సెంచరీ సాధించాడు.వీరి సెంచరీల తర్వాత ఇరు జట్లు కరచాలనం చేసాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ పరిణామం ద్వారా భారత్ ఆటగాళ్ల పట్టుదల, ఆటపై అభిమానం స్పష్టమైంది. తమ వ్యక్తిగత విజయాలను పూర్తి చేసుకునే హక్కును వినియోగించుకుంటూ స్టోక్స్ను షాక్కు గురిచేశారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా, భారత ఆటగాళ్ల ప్రదర్శన మెచ్చుకోదగ్గది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత బెన్ స్టోక్స్ భారత ప్లేయర్లు జడేజా, సుందర్ లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనక్కి తిరగడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. అనంతరం తన తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 669 పరుగులు చేసి 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.
జో రూట్ 150, స్టోక్స్ 141 పరుగులతో మెరిశారు. ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లను ఆడారు. భారత్పై ఇన్నింగ్స్ ఓటమి ముప్పు పొంచి ఉండగా, రెండో ఇన్నింగ్స్లో ఆరంభం దారుణంగా మారింది. 0 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జైస్వాల్, సాయి సుదర్శన్ వరుస బంతుల్లో అవుట్ అయ్యారు.
కేఎల్ రాహుల్ (90 పరుగులు), కెప్టెన్ శుభ్మన్ గిల్ (103 పరుగులతో ) మంచి బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ను నిలబెట్టారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (నాటౌట్ 101), జడేజా (నాటౌట్ 107) అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ను డ్రాగా మలిచారు.
వీరిద్దరూ కలసి ఐదో వికెట్కు 203 పరుగులు జోడించారు. జడేజా 13 ఫోర్లు, 1 సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. సుందర్ తన నాక్ లో 9 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.
మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ, ‘‘చివరి రోజు పిచ్లో ఆటకైనా, ఆటగాడికైనా పరీక్షే. ప్రెషర్ వల్లే మెరుగైన ప్రదర్శన వచ్చింది. ఒక్కో బంతికీ సిద్ధమవుతూ ఆటను ముందుకు తీసుకెళ్లాలని మా లక్ష్యం’’ అని తెలిపారు.
స్టోక్స్ నుంచి వచ్చిన డ్రా ఆఫర్ను తిరస్కరించిన విషయంపై మాట్లాడుతూ, ‘‘జడేజా, సుందర్ ఇద్దరూ 90కి పైగా స్కోరు చేశారు. వాళ్లు సెంచరీలను అందుకోవడం మా అందరికీ గౌరవం అనిపించింది’’ అని చెప్పారు.