Mumbai Indians Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో విజయవంతమైన టీమ్ ముంబై ఇండియన్స్. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఐపీఎల్ 2025లో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.
ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది ముంబై ఫ్రాంచైజీ. అయితే, ఆ టీమ్ అనుకున్న ఫలితాలు రాణించలేకపోయింది. ఆ తర్వాత జట్టు గ్రాఫ్ పడిపోతున్నట్లు కూడా కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించని రోహిత్ శర్మ.. తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ ప్రయాణంపై రోహిత్ శర్మ ఏం చెప్పాడు?
ముంబై ఇండియన్స్ లో తన పాత్రపై తాజాగా రోహిత్ శర్మ బహిరంగంగా మాట్లాడాడు. తన కెరీర్ ఎలా మారిందో వివరించాడు. జియో హాట్స్టార్లో రోహిత్ మాట్లాడుతూ.. "ఐపీఎల్ లో నేను ముంబై ఇండియన్స్ తో ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి పరిస్థితులు స్పష్టంగా మారిపోయాయి. నేను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడిని, ఇప్పుడు, నేనే ఇన్నింగ్స్ను ప్రారంభిస్తున్నాను. నేను కెప్టెన్గా ఉన్నాను.. ఇప్పుడు లేదు కానీ.. మేము ఛాంపియన్లుగా నిలిచినప్పుడు మాతో ఉన్న ప్లేయర్లు ఇప్పుడు ఇంకా జట్టుతోనే కోచింగ్ పాత్రల్లో ఉన్నారు. పాత్రలు మారాయి కానీ.. జట్టుకోసం చేయాలనుకునేది మారలేదు.. మనస్తత్వం ఒకటే విధంగా ఉందని" తెలిపాడు.
ముంబై ఇండియన్స్ కోసం చేయాలనుకున్నది మారలేదు.. రోహిత్ శర్మ !
రోహిత్ శర్మ ఇంకా మాట్లాడుతూ.. "ఈ జట్టు కోసం నేను చేయాలనుకుంటున్నది మారలేదు. మేము ప్రతిసారి అనుకునేది ఒక్కటే జట్టుకు విజయాన్ని అందించాలి. జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాలి. దీనికే ముంబై ఇండియన్స్ ప్రసిద్ధి చెందింది. గత కొన్ని సంవత్సరాలుగా మేము విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్నాము. మేము ట్రోఫీలను గెలుచుకున్నాము.. ఎవరూ నమ్మని పరిస్థితుల నుండి ఆటను మార్చుకున్నాము.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాము" అని రోహిత్ శర్మ తెలిపారు.
ముంబై ఇండియన్స్ ప్లేయర్లపై రోహిత్ శర్మ ప్రశంసలు !
ముంబై ఇండియన్స్ టీమ్ ప్రత్యేకతను వివరించిన రోహిత్ శర్మ.. జట్టు ప్లేయర్లపై ప్రశంసలు కురిపించాడు. "ట్రెంట్ బౌల్ట్ వంటి ఆటగాళ్ళు ఇక్కడకు గతంలో వచ్చారు, చాలా అనుభవాన్ని తెచ్చిపెట్టారు. ముంబై సంస్కృతిని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఉన్నాడు, అతను అనుభవం, తరగతి రెండింటినీ తీసుకువచ్చాడు. విల్ జాక్స్, రీస్ టోప్లీ వంటి ఆటగాళ్ళు వైవిధ్యాన్ని తీసుకువస్తారు.
ర్యాన్ రికెల్టన్ ఒక ఉత్తేజకరమైన యంగ్ ప్లేయర్. ఈ ఆటగాళ్ళలో ప్రతి ఒక్కరూ జట్టుకు సమిష్టి యూనిట్గా పనిచేస్తున్నారు. జట్టులోని వైవిధ్యం చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మన టీమ్ లో చాలా మంది భారత యంగ్ ప్లేయర్లు ఉన్నారు. వారికి చాలా సామర్థ్యం ఉంది. ఎప్పుడూ వారితో కలిసి ఆడటానికి ఎదురుచూస్తుంటాను.. ప్రస్తుతం నా ముందున్న టార్గెట్ టాటా ఐపీఎల్ 2025 టైటిల్ ను గెలుచుకోవడం.. ముంబై ఇండియన్స్ కు తన స్థానాన్ని, కీర్తిని తిరిగి తీసుకురావడం" అని రోహిత్ శర్మ తెలిపాడు.