Indian Premier League 2025
Indian Premier League 2025 : ఐపిఎల్ 2025 లో వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ మళ్ళీ గాడిలో పడింది. ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటముల ప్రయాణం కొనసాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు గురువారం తలపడగా ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. హోంగ్రౌండ్ లో ఎంఐ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో రాణించిన ఎంఐ విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి మొదట బౌలింగ్ ను ఎంచుకున్నాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అతడి నిర్ణయం సరైనదే... భారీ హిట్టర్లతో నిండిన సన్ రైజర్స్ ను కేవలం 162 పరుగులకే నిలువరించగలిగారు. ఆ తర్వాత 18.1 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి ఈ లక్ష్యాన్ని చేధించారు. దీంతో ఎంఐ పాయింట్స్ టేబుల్ లో మరింత పైకి ఎగబాకింది.
ముంబై విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొట్టాడు. అతడి అద్భుత ప్రదర్శనే ముంబైని గెలిపించింది. బంతితో మ్యాజిక్ చేసిన విల్ జాక్స్ 3 ఓవర్లేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కీలకమైన హెడ్, ఇషాన్ కిషన్ వికెట్లను ఇతడే పడగొట్టాడు.
బ్యాటింగ్ విషయానికి వస్తే ముంబైలో టాప్ స్కోరర్ గా నిలిచాడు జాక్స్. లక్ష్య చేధనలో ముంబై కాస్త తడబడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన జాక్స్ కేవలం 26 బంతుల్లో 36 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసాడు. అతడి సూపర్ ఇన్నింగ్స్ తో ముంబై విజయం ఖాయమయ్యింది. ఇలా జాక్స్ ముంబైని జాకీ పెట్టి లేపిమరీ విజయాన్ని అందించాడు.
MI vs SRH
ముంబై ఇన్నింగ్స్ సాగిందిలా...
163 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభమే అందించారు. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 23 బంతుల్లో 31 పరుగులు, రోహిత్ శర్మ 16 బంతుల్లో 26 పరుగులు చేసారు. రోహిత్ ఔటవగానే క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
సూర్యకుమార్ యాదవ్ 15 బంతుల్లో 26 పరుగులు చేసాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్లో సూపర్ బ్యాటింగ్ చేసాడు... అతడు కేవలం 9 బంతుల్లోనే 21 పరుగులు చేసాడు. ఇక చివరివరకు క్రీజులో వున్న తిలక్ వర్మ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడు 17 బంతుల్లో 21 పరుగులు చేసాడు.
Abhishek Sharma
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్ సాగిందిలా..
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ మంచి ప్రారంభమే అందించారు. హెడ్ తన స్టైల్ కు భిన్నంగా మెల్లగా ఆడాడు... అతడు 29 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేసాడు.
మొదటిమ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ తర్వాత తేలిపోతున్నాడు. గత నాలుగైదు మ్యాచుల్లో అతడు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతున్నాడు. ఈసారి కూడా కేవలం 2 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. మధ్యలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డితో కలిసి క్లాసేన్ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేసాడు. నితీష్ 21 బంతుల్లో 19 పరుగులు, క్లాసేన్ 28 బంతుల్లో 37 పరుగులు చేసారు. చివర్లో అనికేత్ వర్మ 8 బంతుల్లో 18 పరుగులు, కమిన్స్ 4 బంతుల్లో 8 పరుగులు చేసారు.
59 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయింది. 68 పరుగులకు రెండోది, 82 పరుగులకు మూడోది, 113 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయారు. 136 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోగా అనికేత్ వర్మ, కమిన్స్ చివర్లో మెరుపు బ్యాటింగ్ చేయడంతో 163 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై ముందు ఉంచగలిగారు. కానీ ఈ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది ముంబై జట్టు.