ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన చెన్నై.. 12వ
సారి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. అయితే ఈ సీజన్ లో అంతా సాఫీగా సాగుతున్నా గత సీజన్ లో మాత్రం చెన్నై పేలవ ప్రదర్శనను ఆ జట్టు అభిమానులు అంత ఈజీగా మరిచిపోలేరు.
Image credit: PTI
2022 సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ మార్పు ఆ జట్టును మానసికంగా చాల దెబ్బతీసింది. ధోని స్వచ్ఛందంగా తప్పుకుని రవీంద్ర జడేజాకు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పాడు. కానీ సగం సీజన్ గడిచిన తర్వాత జడ్డూ.. ఒత్తిడి తట్టుకోలేక, వరుస పరాజయాల భారంతో తప్పుకున్నాడు. మళ్లో ధోనికే పగ్గాలు అప్పజెప్పాడు.
ధోని తిరిగి జట్టు పగ్గాలు తీసుకున్నా ఆ జట్టు రాత మారలేదు. ఆ సీజన్ లో చెన్నై.. 14 మ్యాచ్ లలో నాలుగు మాత్రమే గెలిచి పది మ్యాచ్ లలో ఓడి 8 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి పదో స్థానంలో ఉన్న మరో అగ్రశ్రేణి జట్టు ముంబై ఇండియన్స్ కూడా ఇవే పాయింట్స్ తో ఉన్న గుడ్డిలో మెల్లలా చెన్నై కి నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
కానీ ఏడాది తిరిగేలోపే చెన్నై మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి 8 గెలిచి ఐదింటిలో ఓడి 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇలా కమ్ బ్యాక్ ఇవ్వడం చెన్నైకి ఇదేం కొత్త కాదు.
2016, 2017 సీజన్ లలో చెన్నై.. బెట్టింగ్ ఆరోపణలతో ఆ రెండేండ్లు నిషేధానికి గురైంది. కానీ 2018లో ఆ జట్టు ఏకంగా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2020లో కూడా చెన్నై.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. కానీ 2021లో ఆ జట్టుదే ఐపీఎల్ ట్రోఫీ.
తాజాగా ఇదే స్ఫూర్తిని ధోనీ సేన ప్రదర్శిస్తోంది. 2022 లో విఫలమైనా 2023లో పట్టుదలతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరిన విధానం స్ఫూర్తిదాయకం. ధోని నాయకత్వ పటిమ, సీనియర్ల అనుభవం, అంతర్జాతీయ స్థాయి బౌలర్లు కాకపోయినా తుషార్ దేశ్పాండే, పతిరాన, తీక్షణల నుంచి అద్భుత ఫలితాలు రాబట్టిన ధోనీ కెప్టెన్సీ నైపుణ్యం, ఆటగాళ్లను వినియోగించుకున్న తీరు అమోఘం. ఇదే దూకుడు మరో రెండు మ్యాచ్ ల పాటు కొనసాగితే చెన్నైకి తిరుగుండదు.