ఐపీఎల్ - 16 మొదలై ఇప్పటికి వారం రోజులు గడుస్తున్నా అభిమానులకు అత్యంత ఉత్కంఠ రేపిన మ్యాచ్ లు లేవనే చెప్పొచ్చు. అయితే వన్ సైడ్ లేదా రెండో ఇన్నింగ్స్ మొదలై 10 ఓవర్లు ముగిశాక విజేతను నిర్ణయించే మ్యాచ్ లే జరుగుతున్నాయి. లో స్కోరింగ్ లేదా హై స్కోరింగ్ గేమ్స్ లో చివరి బంతి వరకు విజయం నువ్వా నేనా అన్నట్టు చేతులు మారాలి.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మూడు రోజుల క్రితం రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తప్పితే మిగిలిన మ్యాచ్ లలో ఆ మజా మిస్ అయింది. కానీ గడిచిన 15 ఏండ్లుగా ఇటువంటి ఉత్కంఠను టన్నుల కొద్దీ పంచుతున్న రెండు దిగ్గజ టీమ్ లు నేడు ఐపీఎల్ లో ఢీకొనబోతున్నాయి.
శనివారం రాత్రి 7.30 గంటల నుంచి వాంఖెడే వేదికగా ఈ రెండు జట్లూ తలపడుతాయి. గణాంకాల పరంగా చూసుకుంటే చెన్నై కంటే ముంబైదే పైచేయి అయినా ఇరు జట్ల మధ్య విజయం ఎవరిదో అంచనా వేయడం చాలా కష్టం. ముంబై - చెన్నై మధ్య ఇప్పటివరకు 34 మ్యాచ్ లు జరుగగా ఇందులో 20 సార్లు ముంబై.. 14 సార్లు చెన్నై నెగ్గింది.
ఓవర్ ఓవర్ కు ట్విస్టులు.. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగే ఈ రెండు జట్ల మ్యాచ్ లను వీక్షించడానికి ఇరు జట్ల అభిమానులే కాదు.. పది ఫ్రాంచైజీల ఫ్యాన్స్ కూడా ఆసక్తితో చూస్తారు. గతేడాది ఈ రెండు జట్లూ లీగ్ లో సరిగ్గా ఆడకపోయినా ముంబై - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లు మాత్రం అభిమానులను అలరించాయి.
ఐపీఎల్ లో ఇప్పటివరకు లీగ్ దశలో 25 సార్లు తలపడ్డ ముంబై- చెన్నైలు నాకౌట్ దశలో 9 సార్లు ఆడాయి. లీగ్ దశలో ఆడిన 25 మ్యాచ్ లలో 15 సార్లు ముంబై.. పది సార్లు చెన్నై గెలిచింది. ప్లేఆఫ్స్ లో ఐదుసార్లు తలపడగా రెండు సార్లు ముంబై మూడు సార్లు సీఎస్కే నెగ్గింది. ఇక ఫైనల్స్ లో నాలుగుసార్లు తలపడగా మూడు సార్లు ముంబై ఒకసారి చెన్నై టైటిల్ సొంతం చేసుకున్నాయి.
ముంబై- చెన్నైల మధ్య జరిగిన 34 మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సురేశ్ రైనా ఉన్నాడు. రైనా.. 736 రన్స్ చేయగా ఆ తర్వాత రోహిత్ శర్మ (711), ఎంఎస్ ధోని (710) ఉన్నారు. బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో.. 35 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.