అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ, 150 చేసి అవుటైన మయాంక్... అనిల్ కుంబ్లే రికార్డుపై అజాజ్ పటేల్ కన్ను...

First Published Dec 4, 2021, 12:54 PM IST

ముంబై టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది.  ఓవర్‌నైట్ స్కోరు 221/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్ కుదురుకోవడంతో 300+ స్కోరును దాటగలిగింది భారత జట్టు...

62 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అజాజ్ పటేల్, ఆ తర్వాతి బంతికే రవిచంద్రన్ అశ్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 


224 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టును మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు...

311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 150 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరడం విశేషం...

మయాంక్ అగర్వాల్‌కి ఇది మూడో 150+ స్కోరు కాగా, టీమిండియా టెస్టు ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ (8 సార్లు), సునీల్ గవాస్కర్ (6 సార్లు) మాత్రమే మయాంక్ అగర్వాల్ కంటే ముందున్నారు.

26 ఇన్నింగ్స్‌ల్లో 3వ సారి 150+ స్కోరు నమోదు చేసిన మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా (4 సార్లు) తర్వాతి స్తానంలో నిలిచాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మయాంక్ అగర్వాల్‌కి ఇది మూడో 150+ స్కోరు. జో రూట్ ఒక్కడే (4 సార్లు), మయాంక్ కంటే ముందున్నాడు. 

మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత దూకుడు పెంచిన అక్షర్ పటేల్, 113 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్‌కి ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ...

128 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన అక్షర్ పటేల్ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు....

ఇప్పటికే టీమిండియా 8 వికెట్లు తీసిన అజాజ్ పటేల్, జిమ్ లాకర్, అనిల్ కుంబ్లేల రేర్ రికార్డుపై కన్నేశాడు. జిమ్ లాక్, అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన బౌలర్లుగా ఉన్నారు. అజాజ్ పటేల్ మరో రెండు వికెట్లు తీస్తే, వీరి సరసన చేరతాడు.

click me!