
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి టెస్ట్లో భారత ప్లేయర్లు అద్బుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు. తొలి రోజు యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ సెంచరీలో అదరగొట్టగా, రెండో రోజు రిషబ్ పంత్ సెంచరీతో దుమ్మురేపాడు. జైస్వాల్, గిల్, పంత్ సెంచరీతో భారత్ ఇంగ్లాండ్ పై అధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటికే టీమిండియా స్కోరు 400+ మార్కును దాటింది.
99 పరుగుల వద్ద ఉన్న సమయంలో సూపర్ సిక్సర్ తో పంత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 146 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 71.92 స్ట్రైక్ రేటుతో తన సెంచరీని సాధించాడు.
ఇంగ్లాండ్ పై లీడ్స్ లో ఈ సెంచరీతో రిషబ్ పంత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత టెస్ట్ క్రికెట్లో వికెట్ కీపర్ గా ఎక్కువ సెంచీరీలు చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు.
రిషభ్ పంత్ – 7 సెంచరీలు
ఎంఎస్ ధోని – 6 సెంచరీలు
వృద్ధిమాన్ సాహా – 3 సెంచరీలు
భారత్ జట్టు తొలి రోజు నుంచి ఇంగ్లాండ్ పై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలి రోజు భారత జట్టు 359/3 స్కోరుతో డే 1 ముగించింది. కెప్టెన్గా తొలిసారి బరిలోకి దిగిన శుభ్మన్ గిల్ అజేయంగా 127 పరుగులతో సెంచరీ కొట్టాడు. మొదటి రోజు వైస్-కెప్టెన్ రిషభ్ పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు సెంచరీని పూర్తి చేశాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుపు సెంచరీతో (101 పరుగులు) రాణించాడు. గిల్ 147 పరుగులు చేసి రెండో రోజు అవుట్ అయ్యాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గతంలో హెడింగ్లీ మైదానంలో జరిగిన ఆరు టెస్టుల్లో తొలుత బౌలింగ్ చేసిన జట్లు విజయం సాధించిన దృష్ట్యా, స్టోక్స్ ఇదే వ్యూహాన్ని అనుసరించాడు.
"బౌలింగ్ చేస్తాం. హెడింగ్లీ మంచి క్రికెట్ పిచ్. ఇక్కడ మేము మంచి మ్యాచులు ఆడాం. మొదటి సెషన్లో పిచ్కు మద్దతు ఉండొచ్చు. ఇది రెండో సిరీస్ మాత్రమే అనే విషయం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది కౌంటీ క్రికెట్ ఆడారు, మేము మూడు రోజుల ప్రాక్టీస్ చేశాం" అని స్టోక్స్ తెలిపాడు.
భారత్ కెప్టెన్ గిల్ మాట్లాడుతూ: "మేము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. మొదటి సెషన్ కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ తర్వాత బ్యాటింగ్కు అనుకూలంగా మారుతుంది. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం, ప్రిపరేషన్ బాగుంది. సాయి సుదర్శన్ తొలిసారి టెస్ట్ ఆడుతున్నాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కరుణ్ కూడా జట్టులో ఉన్నాడు" అన్నారు.
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ తొలి రోజు సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగింది. మొదట జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ పూర్తి చేశాడు. ఈ ప్రదర్శనతో అతను ఆసీస్, ఇంగ్లాండ్లో తొలి టెస్టుల్లో సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
శుభ్మన్ గిల్ కెప్టెన్గా తన తొలి టెస్ట్లోనే శతకం సాధించి అజేయంగా నిలిచాడు. ఇది అతనికి టెస్ట్ కెప్టెన్సీలో తొలి ఇన్నింగ్స్ కావడం విశేషం. భారత్ తరఫున కెప్టెన్గా తొలి టెస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో గిల్ నాలుగో స్థానంలో చేరాడు.
• విజయ్ హజారే: 164* vs ఇంగ్లాండ్, ఢిల్లీ, 1951
• సునీల్ గవాస్కర్: 116 vs న్యూజిలాండ్, ఆక్ల్యాండ్, 1976
• విరాట్ కోహ్లీ: 115 vs ఆస్ట్రేలియా, అడిలైడ్, 2014
• శుభ్మన్ గిల్: 127* vs ఇంగ్లాండ్, లీడ్స్, 2025