
India vs New Zealand Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మరో సూపర్ సండే వచ్చింది. ఎందుకంటే భారత్ - న్యూజిలాండ్ మధ్య గొప్ప మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూజిలాండ్ పై భారత్ వేటకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగే ఈ మ్యాచ్లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు సాధించనున్నాడు. మరీ గెలిచేది ఎవరబ్బ?
సూపర్ ఫామ్ లో భారత్.. జోరు కొనసాగాస్తామంటున్న న్యూజిలాండ్
భారత్ జట్టు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది. అలాగే, న్యూజిలాండ్ కూడా వరుస విజయాలో జోరు కొనసాగించాలని చూస్తోంది. రెండు జట్లు వరుసగా రెండు విజయాలు సాధించాయి. భారత జట్టు ఇప్పుడు స్పిన్ను బాగా ఆడటంపై దృష్టి పెడుతుంది. ఇప్పటివరకు తుది జట్టులోకి రాని ఆటగాళ్లకు ఆదివారం న్యూజిలాండ్తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్లో అవకాశం లభించవచ్చు. చివరి గ్రూప్ మ్యాచ్లో విజయం సాధించి గ్రూప్ Aలో టాప్ లోకి వెళ్లాలని భారత్ చూస్తోంది.
రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచింది, కానీ స్పిన్నర్లు భారతీయులను ఇబ్బంది పెట్టారు. సెమీ-ఫైనల్స్కు అర్హత సాధించిన న్యూజిలాండ్ జట్టు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ స్పిన్నర్లు మెహదీ హసన్ మీరాజ్, రిషద్ హొస్సేన్లపై భారత స్టార్ బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్పై కూడా అదే కనిపించింది.
న్యూజిలాండ్ స్నిన్నర్లతో భారత్ కు సవాలే !
భారత్ జట్టు ఇప్పుడు మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్వెల్ సవాలును ఎదుర్కోనుంది. భారత ఆటగాళ్లకు ఈ టోర్నమెంట్లో స్పిన్కు అత్యంత కఠినమైన పరీక్ష అవుతుంది. కివీస్ స్పిన్నర్లు ఇద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. దుబాయ్ పిచ్పై మరింత ప్రభావవంతంగా రాణించే అవకాశముంది. భారత బ్యాట్స్మెన్ స్పిన్నర్లపై సింగిల్స్ తీయడం, ఫాస్ట్ బౌలర్లపై భారీ షాట్లు ఆడటం అలవాటు చేసుకున్నారు, కానీ ఇప్పుడు వారు సాంట్నర్, బ్రేస్వెల్ల 20 ఓవర్లను ఎదుర్కోవలసి వస్తుంది, గ్లెన్ ఫిలిప్స్ కూడా అవసరమైన సమయంలో స్పిన్ తో అదరగొడతాడు.
న్యూజిలాండ్ vs భారత్
గత ఏడాది చివర్లో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో సాంట్నర్, ఫిలిప్స్లపై భారత్కు చేదు అనుభవం ఎదురైంది. ఆ సిరీస్ లో భారత్ 0-3 తేడాతో ఓడిపోయింది, ఇప్పుడు ఈ ఇద్దరితో పాటు బ్రేస్వెల్ కూడా ఉన్నాడు, అతను ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో కొంతవరకు బౌలింగ్ చేశాడు. అటువంటి పరిస్థితిలో, ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్, పాకిస్థాన్పై అజేయ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లు వారిని ఎదుర్కొంటేనే భారత్ మంచి స్కోర్ చేయగలుగుతుంది.
టోర్నమెంట్కు ముందు, జట్టులో ఐదుగురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ లను ఎంపిక చేసినందుకు టీమిండియా విమర్శలకు గురైంది, కానీ ఇక్కడ స్పిన్నర్ల ఆధిపత్యం భారతదేశాన్ని బలోపేతం చేసింది. అలాగే, భారత ఫాస్ట్ బౌలింగ్ కూడా ప్రభావం చూపుతోంది.
భారత్ రెండు మ్యాచ్ల్లో జడేజా, అక్షర్, కుల్దీప్లను రంగంలోకి దించింది. ముగ్గురూ కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెడుతూ పరుగులు రాకుండా అడ్డుకున్నారు. పాకిస్థాన్పై మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, స్పిన్నర్ల చేతిలో 11వ ఓవర్ నుండి 34వ ఓవర్ వరకు ఎక్కువ పరుగులు రాలేదు. పాకిస్తాన్ బ్యాట్స్మన్ వరుసగా 9 ఓవర్లలో ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు.
అయితే, న్యూజిలాండ్లో కేన్ విలియమ్సన్, విల్ యంగ్, టామ్ లాథమ్, డెవాన్ కాన్వే వంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు, వారు స్పిన్ను చాలా బాగా ఆడగలరు. భారత్ విజయాల ఊపును కొనసాగించాలని కోరుకుంటుంది. ఇదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ షమీలకు సెమీ-ఫైనల్స్ ముందు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ అసౌకర్యంగా కనిపించాడు. 20 నిమిషాలు గ్రౌండ్ ను వీడాడు. రిషబ్ పంత్ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ ఆడే అవకాశం లభించవచ్చు. కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దించవచ్చు.