టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ లేక పదేండ్లు దాటిపోయింది. 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత్ పలుమార్లు ఐసీసీ టోర్నీలలో ఫైనల్ కు చేరినా రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. 2021లో డబ్ల్యూటీసీ ఫైనల్, 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఇలా వరుసగా ఓటముల పాలవుతున్నది.
అయితే కీలక టోర్నీలలో ఓడిపోవడానికి ఒత్తిడిని అధిగమించకపోవడం వంటి బలహీనతలు ఉన్నా చాలా మంది విశ్లేషకులు చెబుతున్న మాట, వేలెత్తి చూపుతున్నది ఐపీఎల్ వైపే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్లే భారత క్రికెట్ ఐసీసీ టోర్నీలలో గెలవలేకపోతున్నదన్నది ప్రధానంగా ఉన్న విమర్శ.
26
కానీ ఐపీఎల్ భారత క్రికెట్ కు మేలు చేస్తుందన్నవారూ లేకపోలేదు. ఐపీఎల్ వల్లే భారత క్రికెట్ కు చాలా మంది మెరుగైన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లలో అదరగొడుతున్నారన్నవారూ ఉన్నారు. తాజాగా విండీస్ దిగ్గజం, ఆ జట్టుకు రెండు సార్లు వరల్డ్ కప్ అందించిన క్లైవ్ లాయిడ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
36
రెవ్ స్పోర్ట్స్తో లాయిడ్ మాట్లాడుతూ.. ‘ఇండియా ఐసీసీ ఫైనల్స్, సెమీస్ లో ఓడిపోతుందని అంటున్నారు. కానీ ఇక్కడిదాకా అయితే వస్తోంది కదా. దానిని ఎవరూ చూడటం లేదు. ట్రోఫీ గెలవడం పెద్ద విషయమేమీ కాదు. నిలకడగా రాణించడమే ముఖ్యం. టీమిండియా కొద్దిరోజులుగా ఆ విషయంలో అయితే సక్సెస్ అవుతున్నది. దీనికి కారణం ఐపీఎల్ అని చెప్పడంలో సందేహమే లేదు.
46
ఇండియాకు ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్, టీ20లకు, టెస్టులకు మంచి టీమ్ ఉంది. పెద్ద టోర్నీలలో ట్రోఫీలు గెలవడమనేది కూడా త్వరలోనే పూర్తవుతుంది. రాబోయే రోజుల్లో టీమిండియా అలాంటివి చాలా నెగ్గుతుందన్న విశ్వాసం నాకుంది..’అని చెప్పుకొచ్చాడు.
56
ఇక 1983 జూన్ 25న భారత జట్టు తమను ఓడించి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడం నిన్నటికి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా లాయిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేం ఇండియాను 183 పరుగులకే కట్టడి చేశాం. అప్పట్లో మేం ఉన్న ఫామ్, బ్యాటింగ్ లైనప్ కు అదేం పెద్ద స్కోరు కాదు. కానీ క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఈ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
66
ఇండియాకు ఆ విజయం ఇచ్చిన కిక్కుతో ఆ జట్టు భవిష్యతే మారిపోయింది. ఒకరకంగా భారత్ ఆ వరల్డ్ కప్ గెలవడం ఆ దేశంతో పాటు ప్రపంచానికి కూడా మంచే చేసింది. భారత్ నుంచి ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఇండియా క్రికెట్ లో సూపర్ పవర్ అయింది. ఇది భారత క్రికెట్ కు చాలా మంచిది..’అని తెలిపాడు.