ఈ ఏడాది భారత జట్టు స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. అక్టోబర్ - నవంబర్ మధ్య జరుగబోయే ఈ టోర్నీకోసం భారత్ ఇప్పటికే ప్రణాళికలు రచించి వాటిని అమలుపరుస్తున్నది. ఇందులో భాగంగానే శిఖర్ ధావన్ ను వన్డే జట్టు నుంచి తప్పించి కెఎల్ రాహుల్ ను మిడిలార్డర్ కు చేర్చి శుభమన్ గిల్ ను రోహిత్ తో ఓపెనర్ గా పంపిస్తున్నది.
గత నెలలో బంగ్లాదేశ్ తో చివరి వన్డేలో డబుల్ సెంచరీ చేయడం ద్వారా తాను కూడా ఓపెనర్ గా పోటీలో ఉన్నానని ఇషాన్ కిషన్ చెప్పకనే చెప్పాడు. డబుల్ సెంచరీ చేసినా అతడిని పక్కనబెట్టి గిల్ నే ఓపెనర్ గా ఆడిస్తున్నాడు రోహిత్ శర్మ.
అయితే గిల్ ను మూడో స్థానంలో పంపి, కోహ్లీని నాలుగో స్థానానికి ఆడించినా పెద్ద నష్టమేమీ లేదని.. రోహిత్, కిషన్ లు ఓపెనర్లుగా రావాలని విశ్లేషణలు చేసేవారూ లేకపోలేదు. ఇలా అయితే భారత బ్యాటింగ్ లైనప్ బలోపేతమవుతుందని వాదించేవారూ ఉన్నారు.
ఇటీవలే ముగిసిన లంకతో సిరీస్ తో పాటు తాజాగా న్యూజిలాండ్ తో ముగిసిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ చేయడం ద్వారా గిల్ కూడా టీమ్ మేనేజ్మెంట్ కు కొత్త తలనొప్పిగా మారాడు. మరో ప్రత్యామ్నాయం లేకుండా రోహిత్ తో గిల్ మాత్రమే కరెక్టని వాపోతున్నారు.
తాజాగా ఈ చర్చపై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా ఉన్న ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు. ‘వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ తో ఎవరు ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారనే చర్చకు అతడు (గిల్) పక్కనబెట్టాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదిన తర్వాత కూడా ఇటువంటి చర్చలే వచ్చాయి.
గతంలో శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ లు కూడా రోహిత్ తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినప్పుడూ ఇవే చర్చలు వచ్చాయి. కానీ ఇవన్నీ అనవసరం. రోహిత్ తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసేది గిల్ మాత్రమే. వన్డే క్రికెట్ కు గిల్ సరిగ్గా సరిపోతాడు. భారత్ కు గత నెలన్నర కాలంలో రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. గిల్, ఇషాన్ లు ఇద్దరూ మంచి బ్యాటర్లే అయినా ఓపెనర్ గా గిల్ బెటర్ అని నా ఉద్దేశం...’ అని అన్నాడు.