రోహిత్, కోహ్లీ మైదానంలో మంగళహారతులు పట్టడంలేదే.!: రిజ్వాన్ నమాజ్ పై పాక్ మాజీ క్రికెటర్ సీరియస్

First Published Oct 27, 2023, 12:41 PM IST

ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 లో పాక్ ఆటగాళ్లు వ్యవహరిస్తున్న తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం వారికి మాత్రమే దైవభక్తి వున్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. 

Mohammed Rizwan Namas

హైదరాబాద్ : భారత్ లో జరుగుతున్న ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 లో పాకిస్థాన్ ఆటగాళ్లు మతం కోసం హద్దులు మీరుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గ్లవ్స్ వివాదం ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. భారత ఆర్మీ చిహ్నంతో కూడిన గ్లవ్స్ ను ధోని ధరించడంపై వివాదం రేగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ ఆటగాళ్లు ఏకంగా మైదానంలోనే నమాజ్ చేస్తున్నారు...  ఇది ఐసిసికి కనిపించడం లేదా..? అని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలా పాక్ ఆటగాళ్ళు మైదానంలో మతపరమైన ప్రార్థనలు చేయడం ఇతర దేశాల ఫ్యాన్స్ కే కాదు పాక్ మాజీ క్రికెటర్ కూ నచ్చలేదు. మైదానంలో పాక్ ఆటగాళ్ల ప్రార్థనలపై మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా సీరియస్ అయ్యారు. 

Rizwan

ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత సెంచరీలో పాక్ కు విజయాన్ని అందించాడు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్. అయితే సెంచరీ తర్వాత అతడు మైదానంలోనే నమాజ్ చేయడం వివాదంగా మారింది. దీంతో రిజ్వాన్ ఆటకంటే మైదానంలో ప్రవర్తించిన తీరుపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. 

Kaneria

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా సైతం మహ్మద్ రిజ్వాన్ తీరును తప్పుబట్టాడు. పాక్ ఆటగాళ్ళు తమ మతపరమైన ప్రార్థనలు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం చేయాలని...  మైదానంలోకి తీసుకురావద్దని సూచించారు. భారత ఆటగాళ్లకు కూడా దైవభక్తి వుంటుంది... అలాగని వారు మైదానంలో మంగళహారతులు పట్టడం లేదు కదా అంటూ పాక్ ఆటగాళ్లకు చురకలు అంటించారు. 

Pak

పాకిస్థాన్ క్రికెట్ లో ప్రస్తుతం ఆటకంటే మతమే ముందుందని కనేరియా అన్నారు. ఆ తర్వాతయినా ఆటకు ప్రాధాన్యత వుంటుందా అంటే అదీ లేదు... రెండో స్థానం రాజకీయాలకు చోటు వుంటుందన్నారు.  టాలెంట్, ఆటతీరు అనేవి పాక్ క్రికెట్ లో మూడో స్థానానికే పరిమితమని అన్నారు. అందువల్లే పాకిస్థాన్ జట్టులో టాలెంటెడ్ ప్లేయర్స్ కంటే రిజ్వాన్ వంటి మతతత్వం కలిగిన వ్యక్తులకే చోటు లభిస్తోందని ఆ దేశ మాజీ క్రికెటర్ ఆరోపించారు. 
 

Pak

''క్రికెట్ లో జాతి, మతం అనే విబేధాలుండవు... కేవలం టాలెంట్ వుంటే చాలు. కానీ పాక్ క్రికెటర్లు మాత్రం అలా కాదు...   ఇతర దేశాల ఆటగాళ్ళు, ప్రేక్షకుల ముందే మతపరమైన ప్రార్థనలు చేస్తుంటారు. మైదానంలో ప్రార్థనలేంటి... అంతగా కావాలంటే డ్రెస్సింగ్ రూంలో చేసుకోవాలి. మాకు కూడా చాలా దైవభక్తి వుంది... అలాగని మైదానంలో మంగళహారతులు చేయడంలేదు కదా. భారత ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మైదానంలో ఎప్పుడూ ప్రార్థనలు చేయలేదే... మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లు మీలా ఎప్పుడూ నమాజ్ చేయలేదే'' అంటూ పాక్ ఆటగాళ్లపై కనేరియా సీరియస్ అయ్యారు. 

Pak

ఇక ఎంతో టాలెంట్ తో పాకిస్థాన్ జట్టులో చోటు దక్కించుకున్నా తోటి ఆటగాళ్ల తీరుతో తానెంతో వేదనను అనుభవించినట్లు కనేరియా తెలిపారు. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ తనతో తరచూ మతపరమైన విషయాల గురించి మాట్లాడేవారని... అఫ్రిది అయితే మతం మారాలని ఒత్తిడి చేసేవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక్క ఇంజమామ్ తప్పితే మిగతా పాక్ ఆటగాళ్లంతా తనను ఇబ్బందిపెట్టేవారని... చివరకు తనతో కలిసి తినడానికి కూడా ఇష్టపడేవారు కాదన్నాడు. ఇలా పాకిస్తాన్ కోసం ఆడుతున్న సమయంలో తోటి ఆటగాళ్లతోనే అనేక అవమానాలు, వేదింపులు ఎదురయ్యాయని మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా వెల్లడించాడు. 
 

click me!