ఐసీసీ తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా 2007 లో భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకుడిగా నియమితుడయ్యాడు. ఆ ఏడాది వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు దారుణ ఓటమి తర్వాత సీనియర్లు సచిన్, ద్రావిడ్, గంగూలీలకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ధోనికి ఆ బాధ్యతలు అప్పజెప్పారు.
తనపై బీసీసీఐ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ధోని.. ప్రపంచకప్ ను భారత్ కు అందించాడు. దీంతో అతడు తర్వాత టీ20లతో పాటు వన్డేలకు కూడా సారథిగా ప్రమోట్ అయ్యాడు. వాస్తవానికి ద్రావిడ్ తప్పుకున్న తర్వాత సెలక్టర్లు సచిన్ ను మరోసారి కెప్టెన్ గా ఉండమని, టీమిండియాను నడిపించాలని కోరారట. కానీ సచిన్ మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించి ఆ బాధ్యతలు ధోనికి అప్పజెప్పాలని సూచించాడట.
ఈ విషయాలను భారత మాజీ క్రికెటర్, 1983లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుడు, 2007 లో ఆలిండియా సెలక్షన్ కమిటీ చైర్మెన్ గా ఉన్న దిలీప్ వెంగ్సర్కార్ వెల్లడించాడు. ద్రావిడ్ వారసుడిగా ధోనిని ఎంపిక చేసిన తీరుపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వెంగ్సర్కార్ మాట్లాడుతూ.. ‘గతంలో కెప్టెన్ ను నియమించడానికి సీనియారిటీ, ఆటోమేటిక్ ఛాయిస్ ప్రకారం ఎంపిక చేసుకోవడం. కానీ అందుకు భిన్నంగా మేం అప్పుడు ఆటగాళ్ల క్రికెట్ పై ఉన్న మమకారం, వాళ్ల బాడీ లాంగ్వేజ్, టీమ్ ను ముందుండి నడిపించే సామర్థ్యం, మ్యాన్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను చూశాం.
మేం చూసే లక్షణాలన్నీ మాకు ధోనిలో కనిపించాయి. అతడి బాడీ లాంగ్వేజ్ గానీ.. సహచర ఆటగాళ్లను కలుపుకుపోయే విధానం, వారితో మాట్లాడటం, సానుకూల దృక్ఫథంతో ఆలోచించడం వంటి లక్షణాలన్నీ ధోనిలో కనిపించాయి. దీంతో మేం మరో ఆలోచన లేకుండా ధోనిని సారథిగా ఎంచుకున్నాం..’ అని చెప్పాడు.
ధోని హయాంలో టీమిండియా స్వర్ణయుగం చూసింది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. కానీ ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ గానీ, రెండేండ్లుగా జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ గానీ దానిని సాధించడంలో విఫలమవుతున్నారు.