Cricket Facts: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఈ ఆటకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే ప్రతి క్రికెట్ ప్రేమికుడికి ఆటపై ఆసక్తి ఉన్నప్పటికీ, దాని హిస్టరీ గురించి తెలిసిన వారు మాత్రం తక్కువ.
ప్రపంచంలో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
చాలామంది తొలి అంతర్జాతీయ మ్యాచ్ అంటే ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్నే అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. క్రికెట్ హిస్టరీలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ 1844 సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు అమెరికా, కెనడా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ మైదానంలో నిర్వహించారు. ఈ పోటీలో కెనడా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రీడల హిస్టరీలో రెండు దేశాల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ క్రీడా పోటీగా కూడా గుర్తింపు పొందింది.
25
మొదటి అధికారిక టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
టెస్టు క్రికెట్కు శ్రీకారం చుట్టింది మాత్రం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లే. ఈ రెండు జట్లు 1877 మార్చి 15 నుంచి 19 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో తొలి అధికారిక టెస్టు మ్యాచ్ ఆడాయి. ఈ హిస్టారికల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. అప్పటి నుంచి టెస్టు క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ఫార్మాట్గా కొనసాగుతోంది.
35
ప్రపంచకప్, ఐసీసీ ఆవిర్భావం ఎలా జరిగింది?
క్రికెట్ ప్రపంచకప్ తొలిసారిగా 1975లో ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. ఆ టోర్నీలో వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచి తొలి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ప్రపంచకప్ నాలుగేళ్లకోసారి నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణ బాధ్యతలు చూసే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రారంభం 1909లో జరిగింది. మొదట దీనిని ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ పేరుతో ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు కలిసి ఈ సంస్థను స్థాపించారు. 1965లో దీనికి ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని పేరు మార్చగా, 1989లో ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అనే పేరును స్వీకరించింది. ప్రస్తుతం ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది.
టీమ్ ఇండియా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు ఆడింది?
భారత జట్టు తన తొలి అధికారిక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ను 1932 జూన్ 25న ఇంగ్లాండ్తో ఆడింది. ఈ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. ఆ మ్యాచ్లో భారత జట్టుకు సీకే నాయుడు కెప్టెన్గా వ్యవహరించారు. తొలి మ్యాచ్లో భారత్ 158 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, అదే భారత క్రికెట్ హిస్టరీకి తొలి అడుగుగా నిలిచింది.
55
భారత్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎక్కడ జరిగింది?
భారత్ గడ్డపై జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1933లో ముంబైలో నిర్వహించారు. ఇందులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్తో భారతదేశం అంతర్జాతీయ క్రికెట్ ఆతిథ్య దేశంగా కూడా గుర్తింపు పొందింది. నేడు ప్రపంచ క్రికెట్లో భారత్ అత్యంత శక్తివంతమైన జట్లలో ఒకటిగా నిలవడానికి ఈ హిస్టారికల్ ప్రయాణమే పునాది అయింది. 1844లో ప్రారంభమైన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం నేడు కోట్లాది అభిమానులను అలరిస్తూ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడల్లో ఒకటిగా కొనసాగుతోంది.