మెగా టోర్నీకి ముందు యూఏఈలో జరిగిన ఐపీఎల్ (IPL 2021) ఇంగ్లండ్ (England) ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడిందని ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్ (Jason Roy) అన్నాడు. ఐపీఎల్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. జేసన్ రాయ్, మోయిన్ అలీ, క్రిస్ జోర్డన్, సామ్ కరన్ వంటి వాళ్లు పాల్గొన్నారు.
కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ (sun Risers Hyderabad) తరఫున ఆడిన రాయ్.. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపాడు.
ఇంగ్లండ్ ఓపెనర్ అయిన రాయ్.. టీ20లలో మెరుగైన స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాళ్లలో ఒకడు. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో గెలిచిన అనంతరం రాయ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ నుంచి నేరుగా ప్రపంచకప్ చేరుకోవడం మాకు బిగ్ అడ్వాంటేజ్. ఇక్కడి పిచ్ లు, వాతావరణం, పరిస్థితులకు మేం అలవాటుపడ్డాం. ఐపీఎల్ లో ఆడేవారికి అదొక మంచి అవకాశం’ అని అన్నాడు.
మూడు రోజుల క్రితం భారత్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఓడటం గురించి తమకేం ఆందోళన లేదని, తాము మంచి క్రికెట్ ఆడామని రాయ్ అన్నాడు. తమ బ్యాటింగ్ లైన్ బలంగా ఉందని చెప్పాడు.
ఇంగ్లండ్ జట్టులోని పలువురు ఆటగాళ్లు కొద్దిరోజులుగా టీ20 మ్యాచ్ లు ఆడకపోవడం గురించి కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాయ్ తెలిపాడు.
కాగా.. ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాళ్లైన బెన్ స్టోక్స్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్ లు లేకపోవడం ఆ టీమ్ కు పెద్ద లోటే. అయితే వారి గైర్హాజరీలో కూడా తాము బాగా ఆడతామని చెప్పాడు.