కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, హెడ్ కోచ్‌గా ఆశీష్ నెహ్రా... టీ20 వరల్డ్ కప్ పరాజయం తర్వాత ఫ్యాన్స్ డిమాండ్...

First Published Nov 12, 2022, 11:28 AM IST

ఐపీఎల్‌కీ, టీమిండియాకీ మధ్య క్లాస్ రూమ్‌లో స్లిప్ టెస్టు రాయడానికి, ఐఏఎస్- ఐపీఎస్ ఎగ్జామ్ రాయడానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. అయితే ఈ తేడాని చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీమిండియాకి వరల్డ్ కప్స్ తెచ్చిపెడతాడని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు, రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ వినబడింది. టీమిండియా ఎప్పుడు ఏ మ్యాచ్ ఓడిపోయినా విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ చేతకాదనే విమర్శలు వినిపించాయి. బీసీసీఐ పెద్దలు కూడా దీన్ని నమ్మేశారు...

విరాట్ కోహ్లీని తప్పించి, రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ కట్టబెట్టారు. అయితే సీన్ మాత్రం ఏం మారలేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి 8 సీజన్లలో ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ కాదు కదా.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా కనీసం ఆసియా కప్ కూడా గెలవలేకపోయాడు...

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్ చేరిన భారత జట్టు, ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి... ఇంటిదారి పట్టింది. ఈ పరాజయంతో రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది...

కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పనికి రారని... అనవసర ప్రయోగాలతో ఈ ఇద్దరూ టీమ్‌ని భ్రష్టు పట్టించారని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక్కడితో ఆగకుండా ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొట్టమొదటిసారి గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్సీ చేపట్టిన హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ అప్పగించి, ఆ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాని భారత జట్టు హెడ్ కోచ్‌గా నియమించాలంటూ డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...

ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ చేయలేకపోయిన పనిని, ఒక్క సీజన్‌లో టైటిల్ గెలిచి... అది కూడా లక్కీగా లాటరీలో వచ్చిందని విమర్శలు ఎదుర్కొన్న హార్ధిక్ పాండ్యా చేయగలడా? అనేది మరికొందరి ప్రశ్న..

ఇంతకుముందు ఈ విధంగా ఐపీఎల్ రికార్డు చూసి రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించి తప్పు చేశారని... హార్ధిక్ పాండ్యా కంటే దేశవాళీ టోర్నీల్లో కెప్టెన్‌గా మంచి అనుభవం, రికార్డు ఉన్న శ్రేయాస్ అయ్యర్ లేదా సంజూ శాంసన్‌లకు టీమిండియా టీ20 కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందనేది మరికొందరి వాదన... 

click me!