భార‌త్ కు బిగ్ షాక్.. బెంగ‌ళూరులో 36 ఏళ్ల త‌ర్వాత‌ చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్

First Published Oct 20, 2024, 2:28 PM IST

India vs New Zealand : 1988 తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి విజయాన్ని అందుకుంది. వర్షంతో ప్రభావితమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది.
 

India vs New Zealand: భార‌త జ‌ట్టుకు న్యూజిలాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో కీవిస్ చ‌రిత్ర సృష్టిస్తూ భార‌త జ‌ట్టుపై విజ‌యం సాధించింది. 36 ఏళ్త త‌ర్వాత మ‌రోసారి భార‌త గ‌డ్డ‌పై టెస్టు మ్యాచ్ ను గెలిచింది. 

1988 తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి విజయాన్ని అందుకుంది. వర్షంతో ప్రభావితమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన న్యూజిలాండ్ జ‌ట్టు ఐదో రోజు విజ‌యాన్ని అందుకుంది. 

భారత్ vs న్యూజిలాండ్ 1వ టెస్ట్ హైలైట్స్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ ఓట‌మిపాలైంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మంచి ప్ర‌ద‌ర్శన చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేయ‌గా, న్యూజిలాండ్ 402 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

భారీ ఆధిక్యం ఉన్న‌ప్ప‌టికీ భార‌త జ‌ట్టు ధైర్యం కోల్పోకుండా రెండో ఇన్నింగ్స్ లో 460 పరుగులు చేసి కివీస్ జట్టుపై 106 పరుగుల ఆధిక్యం సాధించింది. 107 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ తన రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Latest Videos


చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ 

36 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచి కివీస్‌ జట్టు చరిత్ర సృష్టించింది. అంత‌కుముందు న్యూజిలాండ్ భార‌త గ‌డ్డ‌పై 1988లో విజ‌యం సాధించింది. అప్పటి న్యూజిలాండ్ కెప్టెన్ జాన్ రైట్. ఆ తర్వాత భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా కూడా ప‌నిచేశాడు. ఇది కాకుండా 1969లో కూడా న్యూజిలాండ్ మరో విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో కమాండ్ గ్రాహం డౌలింగ్ కెప్టెన్ గా ఉన్నారు. 

ఐదో రోజు అద్భుతం జరగలేదు

రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు గెలవాలంటే 107 పరుగులు చేయాల్సి ఉంది. ఐదో రోజు బెంగళూరులో అద్భుతం జరుగుతుందనే ఆశ నెలకొంది. వర్షం కోసం భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. బెంగళూరులో తొలిరోజు మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. ఆ తర్వాత కూడా వర్షం పలుమార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.

ఈ క్ర‌మంలోనే భారీ వర్షం కురిసి మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని టీమిండియా, అభిమానులు కోరుకున్నారు కానీ, వాన‌దేవుడు క‌రుణించ‌లేదు. మ్యాచ్‌లో ఐదో రోజు ఉదయం వర్షం కురవడంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. మేఘావృతమైన పరిస్థితుల్లోనే మ్యాచ్ కొన‌సాగింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ నెమ్మ‌దిగా ఆడుతూ విజ‌యాన్ని అందుకున్నారు. 

భారత్‌కు భయంకరమైన రెండో రోజు

వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్ ప్రారంభం కాలేదు. టాస్ కూడా ప‌డ‌లేదు. రెండో రోజు టాస్‌ జరగగానే భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం తప్పని రుజువైంది. ఆకాశం మ‌బ్బుల‌తో క‌మ్ముకుని ఉన్న ప‌రిస్థితుల్లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించి భారత జట్టును 46 పరుగులకే ఆలౌట్ చేశారు. రోజు ఆట ముగిసిన తర్వాత రోహిత్ తన తప్పును అంగీకరించాడు. పిచ్‌ను సరిగా అంచ‌నా వేయ‌లేక‌పోయాన‌ని పేర్కొన్నాడు. 

రచిన్ రవీంద్ర-టిమ్ సౌథీ సూప‌ర్ ఇన్నింగ్స్ 

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు తొలి ఓవర్లలో ఇబ్బందులు ఎదుర్కొంది. కెప్టెన్ టామ్ లాథమ్ (15) ఔటైన తర్వాత రచిన్ రవీంద్రతో కలిసి విల్ యంగ్ (33) ఇన్నింగ్స్ ను చేజిక్కించుకున్నాడు. విల్ యంగ్ ఔట్ అయిన తర్వాత, ఒక ఎండ్ నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి, కానీ రచిన్ రవీంద్ర మాత్రం నిలదొక్కుకున్నాడు. 134 పరుగులు చేశాడు. అతనికి అనుభవజ్ఞుడైన ఆటగాడు టిమ్ సౌథీ మద్దతు లభించింది. ఫాస్ట్ బౌలర్ సౌతీ బ్యాట్‌తో అద్భుతాలు చేసి 65 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌కి 356 పరుగుల ఆధిక్యం లభించింది.

కౌంటర్‌ ఎటాక్‌తో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 

రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యంతో భారత బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురికాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జట్టుకు శుభారంభం అందించారు. యశస్వి 35 పరుగులు, రోహిత్ శర్మ 52 పరుగులు, విరాట్ కోహ్లీ 70 పరుగులు చేసి ఔట్ అయ్యారు. విరాట్, యువ స్టార్ సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ఇండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. విరాట్ ఔట్ అయిన త‌ర్వాత  సర్ఫరాజ్ రిషబ్ పంత్‌తో కలిసి దాడి కొనసాగించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. పంత్ దురదృష్టవశాత్తు 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

సర్ఫరాజ్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 150 పరుగులు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ 12 పరుగులు, రవీంద్ర జడేజా 5, రవిచంద్రన్ అశ్విన్ 15 పరుగులు చేసి ఔట్ అయ్యారు. భారత్ 460 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దీంతో న్యూజిలాండ్‌కు 107 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా అందుకుంది. విల్ యంగ్ 48, రవీంద్ర 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ అక్టోబరు 24 నుంచి పుణెలో జరగనుంది.

click me!