క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 ప్రపంచకప్ తో మస్తు మస్తుగా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కు మరో నాలుగు నెలల్లో రెండు నెలల పాటు వినోదాన్ని అందించేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఇండియాలో క్యాష్ రిచ్ లీగ్ గా గుర్తింపు పొందిన ఐపీఎల్-2022 షెడ్యూల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నది.
క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే ఐపీఎల్-15 సీజన్ షెడ్యూల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 2 నుంచి ఐపీఎల్ మొదలుకానున్నట్టు తెలుస్తున్నది. గత రెండు సీజన్లు దుబాయ్ లో జరిగిన ఐపీఎల్.. ఈసారి ఇండియాలోనే జరుగుతుందని ఇటీవలే బీసీసీఐ సెక్రటరీ జై షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 2న మొదలుకాబోయే ఐపీఎల్-2022 లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్యే జరుగనున్నట్టు సమాచారం.
ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరడంతో ఈ లీగ్ మరింత ఉత్కంఠభరితంగా మారడం ఖాయం. ఇప్పటివరకు ప్రతి సీజన్ లో 60 మ్యాచులను నిర్వహించిన బీసీసీఐ.. వాటిని 74కు పెంచుతున్న విషయం విధితమే.
ఒక్కో జట్టు తమ సొంత గడ్డపై ఏడు, ఇతర వేదికలపై ఏడు మ్యాచులు ఆడనున్నాయి. 60 రోజుల పాటు సాగే ఈ మెగా ఈవెంట్ లో జూన్ 4 లేదా 5న ఫైనల్ నిర్వహించే అవకాశమున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐపీఎల్-15 పూర్తి షెడ్యూల్ మరికొద్దిరోజుల్లో వెల్లడయ్యే అవకాశమున్నట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ఇటీవలే చెన్నైలో నిర్వహించిన ‘ది ఛాంపియన్స్ కాల్’ కార్యక్రమంలో పాల్గొన్న జై షా మాట్లాడుతూ.. ఈసారి ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుందని చెప్పాడు. అతడు మాట్లాడుతూ.. ‘మీరంతా చెన్నై చెపాక్ స్టేడియంలో సీఎస్కే మ్యాచ్ ఆడితే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.
ఐపీఎల్-15 ఇండియాలోనే జరుగుతుంది. మరో రెండు కొత్త జట్లు కూడా చేరుతుండటంతో ఈసారి లీగ్ మరింత ఉత్సాహభరితంగా ఉండనుంది. త్వరలోనే మెగా వేలం కూడా నిర్వహిస్తాం...’ అని తెలిపాడు.
కరోనా కారణంగా 2020 ఐపీఎల్ సీజన్ ను దుబాయ్ లో నిర్వహించారు. 2021 ఐపీఎల్ సీజన్ భారత్ లోనే జరిగినా.. సెకండ్ వేవ్ సమయంలో మే నెలలో కేసులు విజృంభించడంతో లీగ్ ను అర్థాంతరంగా రద్దు చేశారు. తిరిగి రెండో దశను మళ్లీ దుబాయ్ లోనే నిర్వహించారు.