Ayush Mhatre: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ఒకరికంటే ఒకరు గొప్పగా యంగ్ ప్లేయర్లు అరంగేట్రంలోనే అదరగొడుతున్నారు. ఇప్పటికే ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ వంటి బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ప్రపంచ క్రికెట్ లో తమదైన ముద్రను వేశారు. ఇప్పుడు జాబితాలో మరో తుఫాను బ్యాట్స్మన్ చేరిపోయాడు.
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల యంగ్ ప్లేయర్ కు అవకాశం ఇచ్చింది. ఇలా 20 ఏళ్లలోపు ప్లేయర్లకు సీఎస్కే ఛాన్స్ ఇవ్వడం ఐపీఎల్ చరిత్రలో ఇది నాల్గవసారి. గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో 20 ఏళ్ల షేక్ రషీద్ ఐపీఎల్ అరంగేట్రం చేయగా, ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రేను రంగంలోకి దించింది. తొలి మ్యాచ్లోనే తన బ్యాటింగ్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు మాత్రే.
చెన్నై సూపర్ కింగ్స్ తరపున అతి పిన్న వయస్సులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా ఆయుష్ మాత్రే నిలిచాడు. 17 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు షేక్ రషీద్ 20 ఏళ్ల వయసులో చెన్నై తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 17 ఏళ్ల 278 రోజుల్లో ఆయుష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అతిపెద్ద క్రికెట్ లీగ్లోకి అడుగుపెట్టాడు. కేవలం అడుగుపెట్టడమే కాదు, తన బ్యాటింగ్తో భారతీయ అభిమానులకు కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు, భారత్కు మరో అరుదైన వజ్రం సిద్ధమైందని తన నాక్ తో చూపించాడు.
Ayush Mhatre
రాహుల్ త్రిపాఠి స్థానంలో ఆయుష్కు ఛాన్స్
వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టులో రాహుల్ త్రిపాఠి స్థానంలో ఆయుష్ మాత్రేను తుది జట్టులోకి తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు తొలి వికెట్ రచిన్ రవీంద్ర రూపంలో పడింది. ఆ తర్వాత మూడో స్థానంలో ఆయుష్ బ్యాటింగ్కు వచ్చాడు. ఎడమచేతి వాటం మాజీ బ్యాట్స్మన్ సురేష్ రైనా ఆడే స్థానంలోనే అతడిని ఆడించారు.
Ayush Mhatre
అరంగేట్రంలోనే బ్యాట్తో దుమ్మురేపిన ఆయూష్ మాత్రే
ఆయుష్ మ్హాత్రే ఐపీఎల్ తన ఇన్నింగ్స్ మూడో బంతికే సిక్సర్ బాదాడు. యంగ్ బౌలర్ అశ్విని కుమార్ వేసిన ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టి, ఆ తర్వాత నాలుగో, ఐదో బంతులకు వరుసగా రెండు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు.
తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే వరుసగా మూడు బౌండరీలు కొట్టి భారత జట్టులోకి వచ్చే మరో భవిష్యత్తు స్టార్ ను అంటూ సంకేతాలు పంపాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఆయుష్ దీపక్ చాహర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు.