India vs Oman : ఆసియా కప్ 2025లో భారత జట్టు ఒమన్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, దాదాపు ఓడిపోయే పరిస్థితి నుంచి భారత్ విజయం వైపు ముందు సాగడానికి ప్రధాన కారణం హార్ధిక్ పాండ్యా. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అబుదాబిలోని షేఖ్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్లో భారత్, ఒమన్ మ్యాచ్ థ్రిల్లర్ గా మారింది. అయితే, చివరలో భారత్ పైచేయి సాధించడంతో ఓటమి నుంచి తప్పించుకుంది. ఒమన్పై 21 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 188 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ ముందు వుంచింది. ఒమన్ జట్టు ధైర్యంగా టార్గెట్ వైపు సాగింది. మ్యాచ్ ను మరింత థ్రిల్లింగ్ మార్చింది. చివరి వరకు పోరాడిన ఒమన్ 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
ఒక దశలో మ్యాచ్ దాదాపు భారత్ నుంచి దూరం చేసేలా మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది. అయితే, 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా పట్టిన అద్భుత క్యాచ్ ఈ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాతి ఓవర్ లో వికెట్ కూడా తీశాడు.
25
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్
టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు. 6 పరుగుల వద్దనే శుభ్ మన్ గిల్ ఔటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడును కొనసాగిస్తూ సంజూ శాంసన్ తో కలిసి రెండో వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం అందించారు.
35
అభిషేక్ దూకుడు.. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ నాక్
అభిషేక్ శర్మ మరోసారి తన తుఫాను బ్యాటింగ్ ను చూపించాడు. కేవలం 15 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 38 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. అతను ఔటైన తర్వాత సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 45 బంతుల్లో 56 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి.
తిలక్ వర్మ 18 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 13 బంతుల్లో 26 పరుగులు సాధించాడు. హార్దిక్ పాండ్యా (1), శివం దూబే (5)లు నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రాకుండా, ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. హర్షిత్ రాణా (13), కుల్దీప్ యాదవ్ (1*) చివరలో బ్యాటింగ్ చేశారు. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
ఒమన్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో భారత్ కు గట్టిపోటీ ఇచ్చింది. ఒమన్ తరఫున షా ఫైసల్ 2 వికెట్లు తీశాడు. జితేంద్ర రమానంది 2 వికెట్లు సాధించాడు. ఆమీర్ కలీమ్ కూడా 2 వికెట్లు తీసి జట్టుకు మంచి మద్దతు అందించాడు. చివరి ఓవర్లలో ఒమన్ బౌలర్లు భారత్ స్కోరును కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు.
55
ఒమన్ బ్యాటింగ్ అదుర్స్.. హార్దిక్ క్యాచ్ టర్నింగ్ పాయింట్
189 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ జట్టు ధైర్యంగా ఎదుర్కొంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు దూకుడు ప్రదర్శించగా, భారత బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. ఒక దశలో ఒమన్ గెలుపు దిశగా నడుస్తున్నట్లు కనిపించింది. కానీ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా పట్టిన అద్భుత క్యాచ్తో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. దూకుడుగా ఆడుతున్న అమీర్ కలీం అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా తన బౌలింగ్ లో మీర్జాను కూడా అవుట్ చేశాడు. చివరికి ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 167 పరుగులు చేసింది. ఒమన్ బ్యాటర్లలో అమీర్ కలీం 64 పరుగులు, హమ్మద్ మీర్జా 51 పరుగుల నాక్ ఆడారు. కెప్టెన్ జతీందర్ సింగ్ 32 పరుగులతో రాణించాడు. ఈ ముగ్గురు ప్లేయర్లు కొన్ని అద్భుతమైన క్రికెట్ షాట్స్ ఆడారు.
ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. జట్టు ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిన ఈ మ్యాచ్ను టీమిండియా విజయవంతంగా ముగించింది.