Plastic Currency: భారత మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి.. పాత కరెన్సీ నోట్ల సంగతేంటి?

Published : Aug 05, 2026, 11:50 PM IST

Plastic Currency Notes: భారత్‌లో ప్లాస్టిక్ నోట్ల చలామణిపై ఆర్‌బీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ₹10, ₹20 ప్లాస్టిక్ నోట్లు రానున్నాయి. మరి పాత నోట్ల సంగతేంటి? పాత నోట్లు చెల్లకుండా పోతాయా?

PREV
15
త్వరలో భారత మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు: ఆర్‌బీఐ కీలక ప్రకటన

భారత కరెన్సీ వ్యవస్థలో మరో ఒక పెద్ద మార్పు రాబోతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) దేశంలో ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ చర్చకు ఇప్పుడు ఆర్‌బీఐ ఒక స్పష్టమైన రూపునిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్లాస్టిక్ నోట్లను ప్రజల్లోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ ప్లాన్ చేస్తోంది.

ఆగస్టు 5న జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మన దేశంలో కరెన్సీ నిర్వహణ ఖర్చులను తగ్గించడం, నోట్ల ఏజ్ ను పెంచడమే లక్ష్యంగా ఈ ప్లాస్టిక్ నోట్లను పరిచయం చేస్తున్నారు.

25
ప్లాస్టిక్ నోట్లు ఎప్పటి నుంచి వస్తాయి? ట్రయల్స్ ఎలా జరుగుతాయి?

ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయితే ఏప్రిల్ 2027 నుంచి ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి వస్తాయి. అయితే ఇది పూర్తి స్థాయి మార్పు కాదు, ప్రారంభంలో పరిమిత సంఖ్యలోనే నోట్లను విడుదల చేస్తారు. మన దేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులు, తేమ, ప్రజల వాడకాన్ని తట్టుకోగలవో లేదో పరిశీలించడానికే ఈ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఈ ప్రయోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్‌బీఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా 100 కోట్ల ₹10 నోట్లు, అలాగే 100 కోట్ల ₹20 నోట్లు.. మొత్తంగా 200 కోట్ల పాలిమర్ నోట్లను ముద్రించేందుకు అనుమతి లభించింది. మన దేశంలో ఇంత పెద్ద స్థాయిలో ప్లాస్టిక్ కరెన్సీ ట్రయల్స్ జరగడం ఇదే తొలిసారి.

35
అసలు ప్లాస్టిక్ నోట్లు ఎందుకు తెస్తున్నారు?

ప్రస్తుతం మనం వాడుతున్న కాగితం నోట్లు కాటన్ ఆధారిత మెటీరియల్‌తో తయారవుతాయి. కానీ ఈ ప్లాస్టిక్ నోట్లను బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలీప్రొపీలీన్ అనే ప్రత్యేక పాలిమర్ సబ్‌స్ట్రేట్‌తో తయారు చేస్తారు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి..

• ఎక్కువ కాలం మన్నిక: సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.

• పాడైపోవు: ఇవి నీటిలో తడిచినా, నలిగినా, మురికి అంటినా లేదా చిరిగిపోయినా ఏమీ కావు.

• తక్కువ ఖర్చు: నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వల్ల ప్రతీ ఏటా కొత్త నోట్లను ప్రింట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. దీనివల్ల ప్రింటింగ్, రవాణా ఖర్చులు బాగా ఆదా అవుతాయి.

• నకిలీ నోట్లకు చెక్: ప్లాస్టిక్ నోట్లలో అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లు తెస్తారు. సీ-త్రూ విండోస్, హోలోగ్రామ్స్, చూపు లేని వారి కోసం ప్రత్యేక మార్కింగ్స్ వంటివి చేర్చవచ్చు. దీనివల్ల నకిలీ నోట్లను తయారు చేయడం అసాధ్యం.

45
మొదట ఏ నోట్లు రాబోతున్నాయి?

ఆర్‌బీఐ పైలట్ ప్రాజెక్ట్ కోసం కేవలం ₹10, ₹20 నోట్లను మాత్రమే ఎంచుకుంది. ఎందుకంటే రోజువారీ లావాదేవీల్లో అత్యధికంగా వాడేది, వేగంగా చేతులు మారేది ఈ చిన్న నోట్లే. అందుకే ఇవి త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం జరుగుతుంటుంది.

ఈ సమస్యను పరిష్కరించడానికే 100 కోట్ల ₹10 పాలిమర్ నోట్లు, 100 కోట్ల ₹20 పాలిమర్ నోట్లను ముద్రించి మార్కెట్లోకి తెస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే ఈ పాలిమర్ పేపర్ సబ్‌స్ట్రేట్ కోసం గ్లోబల్ టెండర్లను కూడా ఆహ్వానించింది. నోట్లను బ్యాంకింగ్ యంత్రాలు సులభంగా లెక్కించేలా రూపకల్పన చేస్తున్నారు.

55
పాత కాగితపు నోట్లు చెల్లకుండా పోతాయా?

ఈ వార్త వినగానే చాలామందికి వచ్చే అనుమానం.. పాత నోట్లు ఏమవుతాయి అని.. అయితే ఆర్‌బీఐ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కాగితపు నోట్లను తక్షణమే రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.

ప్లాస్టిక్ నోట్లు, పాత కాగితపు నోట్లు రెండూ కూడా ఒకేసారి మార్కెట్లో చెలామణిలో ఉంటాయి. కాబట్టి ప్రజలు తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదు. పాత నోట్లు ఎప్పటిలాగే చెల్లుబాటవుతాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి 60కి పైగా దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీ విజయవంతంగా అమల్లో ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్ కూడా చేరబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories