India Debt Report: కేంద్ర ప్రభుత్వ అప్పులు ₹200 లక్షల కోట్లకు చేరాయి. భారత్ ఎవరికి ఎంత అప్పు పడింది? ఎంత వడ్డీ చెల్లిస్తోంది? జీడీపీతో పోలిస్తే పరిస్థితి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
200 లక్షల కోట్ల అప్పులో భారత్.. ఒక్క వడ్డీయే రోజుకి ఎన్ని కోట్లో తెలుసా?
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ప్రపంచ బ్యాంక్ 2025 గణాంకాల ప్రకారం మన జీడీపీ (GDP) దాదాపు 3.96 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మన పొరుగు దేశం పాకిస్థాన్ జీడీపీ కేవలం 407.3 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే భారత్ ఆర్థిక వ్యవస్థ పాకిస్థాన్ కంటే దాదాపు 9.7 రెట్లు చాలా పెద్దది. కానీ, ఈ గొప్ప గ్రోత్ వెనుక దేశంపై పెరుగుతున్న రుణాల భారం కూడా అంతే స్థాయిలో ఉంది.
26
₹200 లక్షల కోట్ల అప్పుల లెక్కలు
మార్చి 2026 నాటికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పులు దాదాపు ₹200.53 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పార్లమెంట్లో మార్చి 2026లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, మార్చి 31, 2026 నాటికి ఉన్న ఈ ₹200.53 లక్షల కోట్ల రుణంలో దేశీయ రుణాలు ₹191.46 లక్షల కోట్లు కాగా, విదేశీ రుణాలు ₹9.07 లక్షల కోట్లుగా ఉన్నాయి. మన మొత్తం కేంద్ర రుణం జీడీపీలో 56.1 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ అప్పుల సంఖ్య దాదాపు ₹218.63 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని తేలింది.
36
బడ్జెట్ లెక్కల్లో ఏముంది?
ప్రభుత్వం విడుదల చేసిన 2026-27 బడ్జెట్ డాక్యుమెంట్ మరో విస్తృతమైన లెక్కను చూపించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం ప్రభుత్వ అప్పులు ₹197.18 లక్షల కోట్లుగా పేర్కొంది. ఇందులో అంతర్గత రుణాలు ₹190.44 లక్షల కోట్లు, విదేశీ రుణం ₹6.74 లక్షల కోట్లు. కానీ వేర్వేరు క్యాలిక్యులేషన్ థియరీలు, ప్రస్తుత ఎక్స్ఛేంజ్ రేట్లు, ఇబిఆర్, క్యాష్ బ్యాలెన్స్ సర్దుబాట్లు చేసిన తర్వాత ఈ మొత్తం అప్పు ఫిగర్ ₹200.53 లక్షల కోట్లకు సరిపోతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అప్పు అనగానే ఏదో ఒక విదేశీ బ్యాంకు లేదా ఒక దేశం ఇచ్చేస్తుందని అనుకుంటారు. కానీ అది తప్పు. కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా డబ్బు సేకరిస్తుంది. ప్రభుత్వం సేకరించే అప్పుల్లో అతిపెద్ద భాగం మన దేశీయ మార్కెట్ నుంచే వస్తుంది. ప్రభుత్వం మార్కెట్లో జారీ చేసే బాండ్లు, డిబెంచర్లు, ట్రెజరీ బిల్స్ ద్వారా ఈ నిధులు వస్తాయి. అంటే మన దేశంలోని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వ బాండ్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు.
56
విదేశీ అప్పు ఎంత?
మొత్తం ₹200.53 లక్షల కోట్ల అప్పులలో విదేశీ రుణం కేవలం ₹9.07 లక్షల కోట్లు మాత్రమే. అంతర్గత రుణం ₹191.46 లక్షల కోట్లుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ మొత్తం అప్పులో విదేశీ రుణాల వాటా చాలా చిన్నదని అర్థమవుతోంది. బడ్జెట్ 2026-27 లెక్కల ప్రకారం కూడా దేశీయ రుణాలతో పోలిస్తే విదేశీ అప్పుల శాతం చాలా తక్కువ. భారత ఆర్థిక వ్యవస్థ విదేశీ రుణాలపై ఎక్కువగా ఆధారపడలేదని ఇది స్పష్టం చేస్తోంది.
66
వడ్డీల రూపంలో ఎంత కడుతున్నాం?
అప్పులు సరే, మరి వడ్డీ భారం ఎంత ఉందో తెలుసా? ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, 2025-26 సవరించిన అంచనాల్లో కేంద్ర ప్రభుత్వం చెల్లించిన మొత్తం వడ్డీ ₹12.74 లక్షల కోట్లు. ఇందులో దేశీయ రుణాల వడ్డీ ₹12.42 లక్షల కోట్లు కాగా, విదేశీ రుణాల వడ్డీ ₹0.33 లక్షల కోట్లు. ప్రభుత్వం సంపాదించే మొత్తం రెవెన్యూ ఆదాయంలో దాదాపు 38.1 శాతం కేవలం పాత అప్పుల వడ్డీలకే సరిపోతోంది.
అయితే ఈ అప్పుల సంఖ్య చూడగానే భారత్ అప్పుల ఊబిలో పడిపోయిందని అనలేం. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఈ ఏడాది ఆగస్టు 11న భారత్ రేటింగ్ను స్థిరంగా ఉన్నట్టు పేర్కొంది. కానీ FY2026లో దేశ మొత్తం ప్రభుత్వ రుణం జీడీపీలో 84.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తూ, ఈ భారీ అప్పుల భారం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక సవాలు అని పేర్కొంది.