Scheme For Pregnants: ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY) కింద కేంద్ర ప్రభుత్వం గర్భిణీలకు డబ్బును అందిస్తోంది. ఈ పథకం ద్వారా గర్భిణులు రూ.5000 పొందుతారు. ఈ డబ్బుల కోసం ఏం చేయాలో? ఎక్కడ అప్లై చేయాలో తెలుసుకోండి.
గర్భిణుల కోసమే కేంద్రప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. 'ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన' (PMMVY) పథకాన్ని అమలు చేస్తోంది. దీన్ని మొదట 2010లోనే ప్రారంభించారు. కానీ అప్పుడు వేరే పేరు ఉండేది. తరువాత 2017లో దీన్ని ఇలా మార్చారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం కోసం ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఈ స్కీమ్ గురించి ఎంతోమంది మహిళలకు తెలియదు. అందుకే ఈ స్కీమ్ ను వినియోగించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. తొలిసారి తల్లయ్యే వారికి ఈ స్కీమ్ లో భాగంగా కేంద్రం రూ.5,000 అందిస్తుంది. రెండోసారి ఆడపిల్ల పుడితే రూ. 6,000 ఇస్తుంది. ఈ డబ్బును తల్లి, బిడ్డ పోషణకు ఉపయోగించుకోవచ్చు.
24
రెండు విడతలుగా ఇస్తారు
ఈ పథకం కింద గర్భం దాల్చినట్లు నమోదు చేసుకోవాలి. అప్పుడు మొదటి విడతగా రూ.3,000 ఇస్తారు. ఇక ప్రసవం అయ్యాక ఆ బిడ్డ జనన నమోదు సమయంలో రెండో విడతగా రూ.2,000 అందిస్తారు. ఇక రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుడితే ప్రభుత్వం రూ. 6,000 అందిస్తుంది. ఈ సాయాన్ని లబ్ధిదారుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా బదిలీ చేస్తారు.
34
ఎవరు అర్హులు?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. గర్భిణీకి కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలి. ఇక వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. MNREGA కార్డు ఉన్నా, లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనాలు పొందుతున్నా ఈ పథకానికి అర్హులే. ఇ-శ్రమ్ కార్డ్, బీపీఎల్ కార్డ్ ఉన్న మహిళలు లేదా దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు. బిడ్డ పుట్టిన 270 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత మాత్రం ఈ పథకం వర్తించదు.
ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ pmmvy.wcd.gov.in లోకి వెళ్లాలి. మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, MCP కార్డ్ వంటి డాక్యుమెంట్లను అందులో అప్లోడ్ చేయాలి. ఆఫ్లైన్లో అయితే మీ దగ్గరలోని అంగన్వాడీ కేంద్రం లేదా ఆరోగ్య కేంద్రంలో ఫారమ్ సబ్మిట్ చేయవచ్చు. విడతల వారీగా డబ్బుల కోసం ఫారమ్లు 1A, 1B, 1C నింపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇటీవల దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. ఏవైనా సమస్యలుంటే హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చు.