Gold Price Today: బంగారం ధరల్లో ఇవాళ ఏ మార్పు లేదు. నిన్నటి రేట్లే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులను చూస్తే.. ఈ స్థిరత్వం ఎంతకాలం కొనసాగుతుందన్నదే ఆసక్తికరంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోకపోవడం..పసిడిపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,63,750 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,50,100గా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి మార్కెట్లలో కూడా బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. అయితే బంగారం ధర స్థిరంగా ఉందని మార్కెట్లో టెన్షన్ పూర్తిగా తగ్గిపోయిందని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే పసిడి ధరలపై ప్రభావం చూపించే అంతర్జాతీయ అంశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
25
ఇప్పుడు యుద్ధం లేదు: అమెరికా
ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు మార్కెట్లకు కీలకంగా మారాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు ప్రస్తుతానికి ఆగినప్పటికీ.. యుద్ధ భయాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తాజాగా ఇరాన్పై కొత్తగా దాడులు చేపట్టే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇరాన్ వైపు నుంచి మళ్లీ దాడులు జరిగితే అమెరికా సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందనే సంకేతాలు కూడా ఉన్నాయి.
అంటే.. ప్రస్తుతానికి పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. ఏదైనా కొత్త పరిణామం చోటుచేసుకుంటే పరిస్థితి మళ్లీ వేడెక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిపై కూడా అంతర్జాతీయ మార్కెట్లు దృష్టి పెట్టాయి. ఇరాన్కు సంబంధించిన నౌకల రాకపోకలను ప్రభావితం చేసేలా అమెరికా చర్యలు కొనసాగిస్తోంది.
35
నౌకలపై అమెరికా ఆంక్షలు
హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దాంతో చమురు ధరలు పెరిగి.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక ఇరాన్పై అమెరికా ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’ పేరుతో 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ చర్యలు చేపట్టింది. ఇరాన్ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి మరింత దూరం చేయడమే ఈ ఆంక్షల ఉద్దేశంగా అమెరికా పేర్కొంది.
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. బంగారాన్ని కూడా అలాంటి సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అందుకే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారితే.. బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే పసిడి ధరలు మళ్లీ పైకి కదిలే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బంగారం మార్కెట్ ఒక కీలక దశలో ఉందని చెప్పొచ్చు. ఇవాళ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది.
55
అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు ఎలా మారతాయి?
ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు ఎలా మారతాయి? హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతాయా? చమురు ధరలు ఏ దిశగా కదులుతాయి? అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఎలా ఉంటుంది? అనే అంశాలు బంగారం ధరలకు కీలకంగా మారనున్నాయి.