EV: ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ వాహనాల వల్ల తలెత్తుతోన్న ఓ సమస్యకు కేంద్రం పరిష్కారం చూపుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) సాధారణంగా ఎలాంటి శబ్దం చేయవు. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఇంజిన్ శబ్దం వినిపించడం వల్ల పాదచారులు, ఇతర వాహనదారులు అప్రమత్తమవుతారు. కానీ ఈవీలు సైలెంట్గా కదలడంతో రోడ్డుపై అవి వస్తున్నాయనే విషయం చాలాసార్లు గుర్తించలేరు. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది.
25
కేంద్ర రవాణాశాఖ కొత్త ప్రతిపాదన
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా తయారు అయ్యే ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, లారీలు, సరకు వాహనాలకు అకౌస్టిక్ వెహికిల్ అలర్టింగ్ సిస్టమ్ (AVAS) తప్పనిసరి కానుంది. ఈ పరికరం వాహనాలు కదులుతున్నప్పుడు కృత్రిమ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాంతో పాదచారులు, రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు ఈవీలు వస్తున్నాయని సులభంగా తెలుసుకుంటారు.
35
ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది.?
కేంద్రం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం.. 2026 అక్టోబరు 1 నుంచి తయారయ్యే కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏవీఏఎస్ తప్పనిసరి కానుంది. 2027 అక్టోబరు 1 నుంచి ప్రస్తుత పాత మోడల్స్ కూడా ఈ వ్యవస్థను అమర్చుకోవాలి. అదే విధంగా ఈ పరికరాలు AIS-173 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.
హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏవీఏఎస్ను ఉపయోగించటం ఇప్పటికే అమెరికా, జపాన్, కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాల్లో తప్పనిసరి చేశారు. ఇప్పుడు భారత్ కూడా అదే దారిలో అడుగులు వేస్తోంది. దీని ద్వారా దేశంలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.
55
ఉపయోగం ఏంటంటే.?
ఈ కొత్త నిబంధనతో రోడ్లపై నడిచే వారు, వాహనదారులు ముందుగానే అప్రమత్తమవుతారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో లేదా దృష్టి సమస్యలు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. పర్యావరణానికి హాని చేయకుండా, కేవలం భద్రత కోసం మాత్రమే తగినంత శబ్దాన్ని సృష్టించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.