
IMD Rain Alert : ఇప్పటికే రుతుపవనాలు భారతదేశం చుట్టూ సముద్రంలో విస్తరించాయి... మరో రెండుమూడు రోజుల్లో తీరప్రాంతాలను తాకే అవకాశాలున్నాయి. అంటే జూన్ ఆరంభంలో ఎండల తీవ్రత తగ్గి వర్షాలు జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కానీ అంతకంటే ముందే తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించాయి... నిన్న (మే 26, మంగళవారం) నుండి జోరువానలు కురుస్తున్నాయి.
రోహిణి కార్తె వేళ ఎండలు మండిపోతాయని అనుకుంటుంటే వాతావరణం వర్షాలకు అనుకూలంగా మారింది... చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అందువల్లే రుతుపవనాల కంటే ముందే వర్షాలు మొదలయ్యాయని తెలిపారు. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో రేపు (మే 28, గురువారం) కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ కురిసినట్లే రేపు కూడా వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ముఖ్యంగా బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురిసే అవకాశాలున్నాయట. కాబట్టి ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
వర్షాలతో వాతావరణం చల్లబడినా ఇది తాత్కాలికమైన ఊరటే... మళ్లీ ఎండలు జోరందుకుంటాయని APSDMA హెచ్చరించింది. రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
రేపటి అంచనా ఉష్ణోగ్రతలు:
45°C - 46°C : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు.
43°C- 44°C : అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం.
40°C - 42°C : రాయలసీమ జిల్లాలు.
ఇవాళ్టి గరిష్ఠ ఉష్ణోగ్రతలు : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 41.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో కూడా రేపు (గురువారం, మే 28) వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలకు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా తోడై ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది వాతావరణ విభాగం.
ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
రాజధాని హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్నిచోట్ల ఈదురుగాలులతో (గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయట. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని.. మే 2 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం ప్రకటించింది.