
Heat Wave Alert : ''ఏమయ్యా సూరీడు... కాస్త శాంతించవయ్యా, ఇలా నిప్పులు కురిపిస్తే ఎలా..'' ప్రస్తుతం తెలుగు ప్రజలు ఇలాగే వేడుకుంటున్నారు. ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి...ఏకంగా వరల్డ్ రికార్డులు బద్దలయ్యే స్థాయిలో ఉంటున్నాయి. మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి వస్తున్నవారు పిట్టల్లా రాలిపోతున్నారు... నిన్న ఒక్కరోజే (మే 22, శుక్రవారం) తెలంగాణలో 34 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. దీన్నిబట్టే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.
ఇవాళ (మే 23, శనివారం) కూడా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ ప్రాంతాల్లో ఎండలు ఎలా ఉండనున్నాయి..? వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కడున్నాయి..? ఏఏ ప్రాంతాలకు ఏ అలర్ట్ జారీ చేశారు..? అనేది తెలుసుకుందాం.
ఇవాళ (మే 23, శనివారం) ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 46°C - 48°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరించింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... మధ్యాహ్నం సమయంలో అస్సలు బయటకురావద్దు.
ఇక అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో 43°C - 45°C... శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల్లో 41°C - 43°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వడగాలులు, ఉక్కపోత కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన విపత్తు సంస్థ సూచించింది.
ఓవైపు మండుటెండలు కొనసాగుతున్న సమయంలో వానలు కూడా కురుస్తాయని APSDMA వెల్లడించింది. ఇవాళ రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. వర్షాల సమయంలో రైతులు, పశువుల కాపరులు సురక్షిత భవనాల్లోకి తలదాచుకోవాలని... పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి చెట్ల కింద అస్సలు నిలబడరాదని సూచించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు తారాస్థాయికి చేరాయి... మిట్టమధ్యాహ్నం స్యూర్యుడు నడినెత్తిపైకి వచ్చి నిప్పులు కురిపిస్తున్నాడు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే ఇండియాలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలకంటే కేవలం 3 డిగ్రీలే తక్కువ. ఈ స్ధాయిలో ఎండలు కొనసాగుతుండటంతో ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాతావరణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎండల వేళ వీచే వడగాల్పుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో టెంట్లు వేయాలి... చలివేంద్రాలు ఏర్పాటుచేసి మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందించాలని సూచించారు. ఈ ఎండల వేళ పల్లెలు, పట్టణాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంటే ఆయా జిల్లాల కలెక్టర్లు నమోదవుతున్న ఎండలు, వడగాలుల తీవ్రతను బట్టి సెలవులపై నిర్ణయం తీసుకుంటారు.
మే 23 (శనివారం) అంటే రేపు తెలంగాణలో మండుటెండలు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. వడగాల్పులు వీచే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోయినా సాయంత్రం వర్షాలతో వాతావరణ కాస్త చల్లబడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇలా ఎండలు, వడగాలులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ప్రమాదం పొంచివున్న జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.