Schools Bandh : తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవు... స్కూళ్లు, కాలేజీల బంద్ కు జేఏసి పిలుపు

Published : Aug 04, 2026, 04:49 PM IST

ఈ ఆగస్ట్ లో తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవులు వస్తున్నాయి. ఆదివాసీ జేఏసి బంద్ కు పిలునివ్వడంతో ఆగస్ట్ 8న స్కూళ్లు, కాలేజీలతో పాటు వ్యాపార సంస్థలు మూతపడనున్నాయి.

PREV
15
విద్యాసంస్థల బంద్

Manyam Bandh : పండగలు, ప్రత్యేక పర్వదినాల సందర్భంగా ఈ నెల (ఆగస్ట్) లో భారీగానే సెలవులున్నాయి. భారీ వర్షాలు, బంద్ ల కారణంగా వీటికి మరికొన్ని సడన్ హాలిడేస్ యాడ్ అవుతున్నాయి. ఇలా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల విద్యార్థులకు ఈ వారమే ప్రత్యేక సెలవు రాబోతోంది. గిరిజన హక్కుల సాధన కోసం ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ మన్యం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఊహించని సెలవు వస్తోంది.

25
ఆగస్ట్ 8న 'మన్యం బంద్'

గిరిజన హక్కుల సాధన, ఏజెన్సీ ప్రాంతాల ఆత్మగౌరవ రక్షణ కోసం ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు మన్యం, ఏజెన్సీ జిల్లాల్లో ఆగస్ట్ 8వ తేదీన అంటే వచ్చే శనివారం బంద్ చేపట్టాలని పిలుపునిచ్చింది. గిరిజనుల దశాబ్దాల డిమాండ్ అయిన జీవో నంబర్ 3 పునరుద్ధరణతో పాటు ఇతర ప్రాథమిక రాజ్యాంగ హక్కులను సాధించడమే ధ్యేయంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ మన్యం బంద్ ప్రభావంతో ఏజెన్సీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఆగస్ట్ 8న రెండో శనివారం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు ఎలాగూ సెలవు ఉంటుంది. అయితే కొన్ని స్కూల్స్, కాలేజీలు రెండో శనివారం కూడా నడుస్తాయి... ఇలాంటి విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మన్యం బంద్ వల్ల సెలవు రానుంది. ఇక వ్యాపార సంస్థలు కూడా మూతపడే అవకాశాలుంటాయి కాబట్టి కొందరు ఉద్యోగులకు కూడా సెలవు ఉండే అవకాశాలున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో అదీ కొన్ని ప్రాంతాల్లోనే ఈ బంద్ ప్రభావం ఉంటుంది.

35
ఈ జిల్లాల్లోనే బంద్ ప్రభావం..

ఆగస్ట్ 8న చేపట్టనున్న మన్యం బంద్ ఉత్తరాంధ్ర, కోస్తా ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కింది జిల్లాల్లో రవాణా, విద్యా, వాణిజ్య రంగాలు స్తంభించనున్నాయి

పార్వతీపురం మన్యం జిల్లా : ఈ జిల్లాలోని ఏజెన్సీ మండలాలు, గిరిజన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో బంద్ వాతావరణం నెలకొనే సూచనలు ఉన్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా : పాడేరు, అరకు, చింతపల్లి, రంపచోడవరం వంటి ప్రధాన కేంద్రాల్లో బంద్ తీవ్ర ప్రభావం చూపనుంది.

ఏలూరు జిల్లా : పోలవరం ఏజెన్సీ ప్రాంతంతో పాటు పరిసర గిరిజన గ్రామాల్లో వ్యాపారాలు నిలిచిపోనున్నాయి.

ఇతర ఏజెన్సీ మండలాలు : ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో కూడా బంద్ ప్రభావం కనిపిస్తుంది.

ఆదివాసి జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు మూతపడనున్నాయి. ఆర్టీసీ బస్సు సర్వీసులు, ప్రైవేటు రవాణా వాహనాల రాకపోకలపై కూడా ప్రభావం పడవచ్చు. అలాగే వర్తక, వ్యాపార యజమానులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.

అత్యవసర వైద్య సేవలు, పాలు, మందుల దుకాణాలు వంటి నిత్యావసర సేవలకు మినహాయింపు ఇస్తూ, మిగిలిన అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు గిరిజన సంఘాలు సిద్ధమవుతున్నాయి. గిరిజనుల ఆత్మగౌరవ పోరాటానికి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఏజెన్సీ ప్రజలు, వ్యాపారులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సపోర్ట్ తెలపాలని నాయకులు కోరారు.

45
సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచే వ్యూహం

ఆగస్ట్ 8న మన్యం బంద్ కు ఆదివాసీ జేఏసి పిలుపునివ్వడం వెనుక ఉన్న వ్యూహం చాలా కీలకమైనది. ప్రతి ఏటా ఆగస్ట్ 9వ తేదీన అంతర్జాతీయంగా 'ప్రపంచ ఆదివాసీ దినోత్సవం' జరుపుకుంటారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని దీనికి ఒక్క రోజు ముందు (ఆగస్ట్ 8న) మన్యం వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై బలమైన ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ భావిస్తోంది.

ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనుల సమస్యలపై స్పందించాలని ఆదివాసీ జేఏసి డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా జీవో నంబర్ 3 పునరుద్ధరణ, షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణపై స్పష్టమైన, అధికారిక ప్రకటన చేయాలని కోరుతున్నారు.

55
ఆదివాసీ జేఏసీ డిమాండ్లివే..

జీవో నంబర్ 3 పునరుద్ధరణ

ఆదివాసీ జేఏసీ చేపట్టిన ఈ బంద్ వెనుక ఉన్న అత్యంత కీలకమైన అంశం జీవో నంబర్ 3 పునరుద్ధరణ. ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు ఇతర స్థానిక ఉద్యోగ నియామకాలలో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో జీవో నంబర్ 3 అమలులో ఉండేది. ఈ ప్రత్యేక ఉత్తర్వు వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యా, ఉద్యోగ అవకాశాలు బయటి వ్యక్తులపాలు కాకుండా స్థానిక గిరిజన యువతకే దక్కేవి.

అయితే ఈ జీవో రద్దు కావడం వల్ల గిరిజన యువత తీవ్రంగా నష్టపోయిందని, వారి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన్యం ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే రద్దయిన జీవో నంబర్ 3ని తక్షణమే పునరుద్ధరించడమే ఏకైక మార్గమని ఆదివాసి జేఏసీ స్పష్టం చేస్తోంది.

50 శాతానికి పైగా జనాభా ఉన్న గ్రామాలను షెడ్యూల్డ్ జాబితాలో చేర్చాలి

ఆదివాసీ జేఏసీ మరో ప్రధానమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచింది. మైదాన ప్రాంతాలు లేదా గిరిజన గ్రామాలు అనే తేడా లేకుండా 50 శాతానికి పైగా గిరిజన జనాభా కలిగి ఉన్న అన్ని గ్రామాలను రాజ్యాంగబద్ధమైన షెడ్యూల్డ్ ప్రాంతాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తోంది.

అనేక గ్రామాల్లో మెజారిటీ జనాభా గిరిజనులే ఉన్నప్పటికీ, సాంకేతికంగా అవి షెడ్యూల్డ్ పరిధిలోకి రాకపోవడం వల్ల ఐదో షెడ్యూల్ కల్పించే ప్రత్యేక రాజ్యాంగ రక్షణలు, నిధులు, సంక్షేమ ఫలాలు ఆయా గ్రామాల ప్రజలకు అందడం లేదు. ఇటువంటి ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్డ్ జాబితాలో చేర్చడం ద్వారా మాత్రమే గిరిజనుల సంస్కృతి, వారి భూములు, సాంప్రదాయ హక్కులకు సంపూర్ణ రక్షణ లభిస్తుందని గిరిజన నాయకులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories