నిండా ముంచిన మొంథా తుపాను.. కోట్ల రూపాయల నష్టం

Published : Oct 31, 2025, 08:00 PM IST

Montha Cyclone Damage : మొంథా తుపాను కారణంగా  భారీ నష్టం జరిగింది. ఈ తుపానుతో రూ.5,244 కోట్ల నష్టం సంభవించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. తక్షణ సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది.

PREV
16
మొంథా తుపాను నష్టంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక

మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా నష్టం సంభవించిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ నివేదికను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపించారు. నివేదిక ప్రకారం, 17 శాఖలు, రంగాలకు సంబంధించిన మొత్తం నష్టం రూ.5,244 కోట్లుగా అంచనా చేశారు.

ప్రస్తుతం ఇది ప్రాథమిక అంచనా మాత్రమేననీ, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది.

26
తుపాను ప్రభావిత ప్రాంతాల వివరాలు

రాష్ట్రం సమర్పించిన నివేదికలో తుపాను ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలు, పాలనా చర్యలు వివరంగా పొందుపరిచారు. దీని ప్రకారం, తుఫాన్ ప్రభావం ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో అత్యధికంగా నమోదైంది.

మొత్తం 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలు తుపానుతో ప్రభావితమయ్యాయి. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.

ప్రభుత్వం RTGS ద్వారా తుపాను గమనాన్ని రియల్ టైమ్ లో పర్యవేక్షించి చర్యలు తీసుకుంది. దీని కోసం 19 జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించింది. తుపాను తీవ్రతను సూచించే ఫోటోలు, డేటాను కూడా నివేదికకు జతపరిచారు.

36
రహదారులు, మౌలిక వసతులపై భారీ దెబ్బ

ప్రాథమిక నివేదిక ప్రకారం రహదారులు, వ్యవసాయ రంగాలు ఎక్కువగా నష్టపోయాయి. మొత్తం 4,794 కి.మీ. ఆర్ అండ్ బీ రహదారులు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ విభాగానికి రూ.2,774 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

అలాగే, 18 జిల్లాల్లో 862 కి.మీ. పంచాయతీ రాజ్ రహదారులు, కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దీని వల్ల రూ.454 కోట్లు నష్టం జరిగింది. 48 పట్టణాల్లో రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. వాటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు.

46
వ్యవసాయం, ఆక్వా రంగాల్లో తీవ్ర నష్టం

1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు తుపాను కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో రూ.829 కోట్లు రైతులు నష్టపోయినట్లు నివేదిక తెలిపింది. తుపాను ప్రభావం 1.74 లక్షల మంది రైతులపై పడింది.

అలాగే, 12,215 హెక్టార్లలో రూ.40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు, 32 వేల ఎకరాల్లో రూ.514 కోట్ల ఆక్వా పంటలు దెబ్బతిన్నాయి.

మొత్తం 23,979 మంది ఉద్యాన రైతులు, వేలాది ఆక్వా రైతులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అదనంగా, 2,261 పశుసంపద నష్టపోయినట్లు నివేదిక పేర్కొంది.

56
విద్యుత్, నీటిపారుదల, గృహాలపై ప్రభావం

రాష్ట్రవ్యాప్తంగా 2,817 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 26,575 డీటీఆర్‌లు ధ్వంసమయ్యాయి, 429 కి.మీ. విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీని వల్ల విద్యుత్ శాఖకు రూ.19 కోట్లు నష్టం జరిగింది. నీటిపారుదల శాఖకు రూ.234 కోట్లు, గృహాలు, సామాజిక మౌలిక వసతులకు రూ.122 కోట్లు నష్టం గుర్తించారు.

అలాగే, మొత్తం 3,045 ఇళ్లు దెబ్బతిన్నాయి. అంగన్వాడీలు, పాఠశాలలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు కూడా ప్రభావితం అయ్యాయి. సహాయక చర్యలలో భాగంగా 1,464 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, 1,36,907 మందికి పునరావాసం కల్పించారు. ఈ చర్యల కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడించింది.

66
కేంద్ర బృందాల పరిశీలనకు విజ్ఞప్తి

తుపాను నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాలను పంపాలని కోరింది. నష్టపరిస్థితిని శాస్త్రీయంగా మదింపు చేసినట్లు, అన్ని సాక్ష్యాలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించామని పేర్కొంది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర సహాయం తక్షణమే అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories