Heavy Rain Alert: రెండు ద్రోణుల ఎఫెక్ట్.. రెండ్రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్

Published : Jun 29, 2026, 06:46 AM IST

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

PREV
15
ముంచెత్తబోతున్న వానలు.. ఈ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల వేడి నుంచి ఉపశమనం లభించినా, ఇప్పుడు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉన్న ఒక ద్రోణి తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

దీనికి తోడు, అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరొక ద్రోణి కూడా యాక్టివ్‌గా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ డబుల్ ద్రోణుల ఎఫెక్ట్‌తో రాబోయే రెండు రోజులు ఏపీ అంతటా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, చెదురుమదురుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.

25
జిల్లాల వారీగా వానల అంచనా.. మంగళవారం వీళ్ళకే అలర్ట్

సోమవారం (జూన్ 29) కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఇక అసలు సిసలైన అలర్ట్ మంగళవారం (జూన్ 30) నాడు ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ

జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ లైట్ వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రానికే మంగళగిరిలో 68.2 మిమీ, రాజంలో 52.5 మిమీ, కాకుమానులో 51.5 మిమీ, తాడేపల్లిలో 45.2 మిమీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది.

35
చెట్ల కింద నిలబడొద్దు.. ఏపీ విపత్తుల సంస్థ సేఫ్టీ టిప్స్

ఈదురుగాలులు, ఉరుములతో వానలు పడేటప్పుడు పబ్లిక్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. వర్షం వచ్చేటప్పుడు పొరపాటున కూడా పెద్ద పెద్ద చెట్ల కింద, రోడ్ల పక్కన ఉండే భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని హెచ్చరించారు. గాలి వేగానికి విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉంది కాబట్టి, రోడ్డుపై నడిచేటప్పుడు కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఇక ఆకాశం మబ్బు పట్టి ఉరుములు వినిపించగానే పొలాల్లో ఉండే రైతులు, కూలీలు, పశువుల కాపరులు అస్సలు రిస్క్ తీసుకోకుండా వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

45
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వానలు

తెలంగాణలోనూ వానలు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు ఫుల్ యాక్టివ్‌గా కదులుతుండటంతో వాతావరణం కూల్ అయింది. సోమవారం (జూన్ 29) తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో వాతావరణ కేంద్రం తెలంగాణవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

55
భాగ్యనగరంలోనూ వానలు

హైదరాబాద్ వాతావరణం కూడా కూల్ అయింది. సోమవారం ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పగటిపూటతో పాటు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం దాదాపు 65 శాతం వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో హఠాత్తుగా ఉరుములతో కూడిన భారీ జల్లులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి, వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories