Markapuram Bus Accident : ఇవాళ తెల్లవారుజామున జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి ముందే ప్రయాణికులు బస్సు కండీషన్ పై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రమాదంలో తప్పెవరిది..?
Markapuram Bus Accident : డబ్బులు వస్తే చాలు... ఎంతమంది ప్రాణాలు పోతే మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు. బస్పు కండీషన్ బాగాలేకున్నా ప్రయాణికులు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నడుపుతున్నాయి... అందుకే అడ్డూ అదుపు లేకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ట్రావెల్స్ సంస్థలు చెత్త బస్సులను రోడ్డెక్కిస్తున్నాయి. ఇలాంటి బస్సుల వల్లే గతంలో కర్నూల్ ప్రమాదమైనా... ఇప్పుడు మార్కాపురం ప్రమాదమైనా.
25
బస్సు కండీషన్ పై నిలదీసిన ప్రయాణికులు...
తెలంగాణలోని జగిత్యాల నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని విజమూరుకు మార్చి 25, బుధవారం రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. అయితే 40 మందికి పైగా ప్రయాణిస్తున్న ఈ బస్సు కండీషన్ పై కొందరు ప్రయాణికులకు ముందే అనుమానం వచ్చింది. ఇది సురక్షితంగా గమ్యానికి చేరుస్తుందనే నమ్మకం లేక బస్సు సిబ్బందిని కూడా నిలదీశారు. కానీ బస్సు సిబ్బంది వారికి సరైన సమాధానం చెప్పకుండా తూతూ మంత్రంగా రిపేర్ చేయించి ప్రయాణాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రమాదానికి బస్సు కండీషన్ కూడా కారణమా..? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
35
ప్రయాణికుల మాట విని జాగ్రత్తపడితే.. ప్రమాదమే జరిగేదికాదుగా..?
సాధారణ ప్రయాణికులే బస్సు కండీషన్ ను గుర్తించారు... ఏదో తేడా ఉందని తెలుసుకున్నారు. అలాంటిది బస్సు యాజమాన్యానికి, సిబ్బందికి ఈ బస్సు కండీషన్ గురించి తెలియదా..? తప్పకుండా తెలిసే ఉంటుంది. అయినా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ బస్సును రోడ్డెక్కించారని అర్ధమవుతోంది.
ప్రయాణికులు చెప్పగానే బస్సును మార్చివుంటే ప్రమాదం జరిగేది కాదేమో.. కానీ మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో బస్సుకు రిపేర్ చేయించారు. పెద్ద సమస్యేమీ లేదు.. స్టీరింగ్ స్ట్రక్ అయ్యిందని డ్రైవర్ ప్రయాణికులకు చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు గంటసేపు రిపేర్ తర్వాత అంతా బాగయ్యిందని చెప్పి బస్సు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు. కానీ కొద్ది సేపటికే అదే మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదానికి గురయ్యింది... 13 మందిని బలి తీసుకుంది.
మార్కాపురంలో ఇవాళ ఉదయం జరిగిన ఘోర ప్రమాదం ఎవరితప్పు..? కండిషన్ లో లేకపోయినా డబ్బుల కోసం బస్సును నడిపిన ట్రావెల్స్ యాజమాన్యానిదా..? ప్రయాణికులు చెబుతున్నా వినకుండా బస్సును నడిపిన సిబ్బందిదా..? బస్సు కండీషన్ లో లేదని తెలిసి కూడా ప్రయాణించిన ప్రయాణికులదా..? ఇలాంటి బస్సులు రోడ్డుక్కి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న రవాణా శాఖ అధికారులదా..?
తప్పు ఎవరిదైనా బలయ్యేది ప్రజలే. గతంలో కర్నూల్, చేవెళ్ల బస్సు ప్రమాదాలు.. ఇప్పుడు మార్కాపురం, బంగ్లాదేశ్ ప్రమాదాలు... ఈ దుర్ఘటనలు మరోసారి రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, వేగ నియంత్రణ లోపం, వాహనాల సాంకేతిక లోపాలు వంటి అంశాలు ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
55
బస్సు ప్రమాద భాదితుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు...
ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే ఈ ప్రమాదంపై సమాచారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో బస్సు ప్రమాద బాధితుల సహాయార్థం నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుండి కంట్రోల్ రూంలు పనిచేస్తాయని కలెక్టర్ తెలిపారు. బాధితులు 7995575699 లేదా 08612331261 నెంబర్లకు ఫోన్ చేసి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. బస్సులోని ప్రయాణికుల వివరాలు సేకరించారు అధికారులు.. అయితే మృతుల వివరాల ఇంకా తెలియాల్సి ఉందని చెబుతున్నారు.