దిత్వా తుపాను ఎఫెక్ట్ : నెల్లూరు, తిరుపతివాసులకు అలర్ట్ ! అతిభారీ వర్షాలు

Published : Nov 30, 2025, 10:55 PM IST

Cyclone Ditwah : దిత్వా తుపాను బలహీనపడింది. సోమవారం ఉదయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

PREV
15
తుపాను అప్‌డేట్: దిత్వా తీవ్రత తగ్గినా.. తీరం వెంబడి భారీ గాలులు, వర్షాలు

Cyclone Ditwah : ఆంధ్రప్రదేశ్ లో దిత్వా తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. సోమవారం (డిసెంబర్ 1) ఉదయానికి ఈ తీవ్ర వాయుగుండం సాధారణ వాయుగుండంగా మరింత బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదివారం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో తెలిపారు.

గడిచిన ఆరు గంటల వ్యవధిలో దిత్వా తుపాను 5 కిలోమీటర్ల వేగంతో కదిలిందని అధికారులు గుర్తించారు. తీవ్రత తగ్గినప్పటికీ, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది.

25
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు

దిత్వా తుపాను ప్రభావం సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. ఈ రెండు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటితో పాటు కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ఇక కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

35
పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం

తుపాను ప్రభావంతో ఆదివారం సాయంత్రం 8 గంటల సమయానికి పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలోని కావలిలో అత్యధికంగా 88.7 మిల్లీమీటర్లు, జలదంకిలో 56.2 మిల్లీమీటర్లు, నావూరులో 55 మిల్లీమీటర్లు, బుచ్చిరెడ్డిపాలెంలో 50.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు ఏపీఎస్డీఎంఏ పేర్కొంది.

45
తుపాను ప్రభావం : ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు

దిత్వా తుపాను నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో ప్రసవానికి దగ్గర్లో ఉన్న 7,871 మంది గర్భిణులను గుర్తించింది. తుపాను ప్రభావిత జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో వీరిని గుర్తించారు. ముందు జాగ్రత్తగా వీరిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ మొదలైంది.

ఆదివారం రాత్రికి 375 మంది గర్భిణులు ఆసుపత్రులకు చేరుకున్నారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన వారు కూడా తక్షణమే ఆసుపత్రులకు రావాలని సూచించారు. పది జిల్లాల్లోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.

ఆసుపత్రుల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ సూపరింటెండెంట్లకు తెలిపారు. అవసరాన్ని బట్టి వైద్య శిబిరాల నిర్వహణకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా తుపాను సన్నాహాక ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

55
దిత్వా తుపాను : విద్యుత్ శాఖ అప్రమత్తం

ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కూడా దిత్వా తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంత అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ విద్యుత్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, గత అనుభవాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి వెంటనే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు.

Read more Photos on
click me!

Recommended Stories