
అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇందుకోసం పార్టీలో ఇకపై కఠిన నిర్ణయాలు వుంటాయని టిడిపి ముఖ్య నాయకులకు, టికెట్ ఆశావహులకు అధినేత హెచ్చరికలు జారీ చేసారు. ప్రజల్లో ఎవరు వుంటున్నారు... ఎవరు పనిచేయకుండా నా దగ్గరకు వచ్చి కేవలం మాటలు చెప్తున్నారో తనకు తెలుసన్నారు. ప్రతిఒక్కరి రిపోర్ట్ తనవద్ద వుందని... టికెట్స్ ఫైనల్ చేసే సమయంలో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటానని చంద్రబాబు పార్టీ నాయకులకు తెలిపారు.
ఉండవల్లి నివాసంలో టిడిపి ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ లో అధికారాన్ని పొందేందుకు ఇప్పటినుండే పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జిల్లాల వారిగా పార్టీ బలోపేతంపై సమీక్షా సమావేశంలో చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈసారి టికెట్ల కేటాయింపు సమయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు చంద్రబాబు నాయకులకు సూచించారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది ఫైనల్ చేసేది తాను మాత్రమే ఫైనల్ చేస్తానని చంద్రబాబు అన్నారు. అందుకోసమే ఎప్పటికప్పుడు టికెట్లు ఆశిస్తున్నవారితో పాటు ఇతర నాయకులు ఫీల్డ్ లో ఎలా పనిచేస్తున్నారు... ప్రజలకు ఎవరెంత దగ్గరవుతున్నారు... ఎలాంటి పనిచేయకుండా కేవలం తన దగ్గరకు వచ్చిన మాటలు ఎవరు చెప్తున్నారు అన్నీ తెలుసుకుంటున్నానని అన్నారు. అదరి డేటా తన దగ్గర వుందని చంద్రబాబు హెచ్చరించారు.
అధికారంలోకి రాగానే ఇక టిడిపి పని అయిపోయిందని సీఎం జగన్ తో పాటు వైసిపి నాయకులు సంబరపడ్డారని.... ఇప్పుడు అదే పార్టీని చేసి భయపడిపోతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు దగ్గరవుతున్నాం కాబట్టే అధికార పార్టీ భయపడుతోందని... వచ్చేది టిడిపి ప్రభుత్వమే అనడానికి ఇదే సంకేతమన్నారు. అలాగని ఏమరపాటు తగదని... పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని చంద్రబాబు టిడిపి నాయకులకు సూచించారు.
టిడిపి నాయకులు వ్యక్తిగతంగా ఏవయినా విబేధాలున్నా పక్కనపెట్టాలని... అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. అలాగయితే టిడిపి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితి గురించి తెలుసుకుంటానని... ఏవయినా సమస్యలు, లోపాలు వుంటే పరిష్కరిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ టిడిపి విజయావశాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోనని చంద్రబాబు హెచ్చరించారు.
ఇక ఇప్పటికే టిడిపి పాత వ్యూహాన్నే సరికొత్తగా అమలు చేసేందుకు సిద్దమైనట్లు ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి. గతంలో మాదిరిగా జనసేన, బిజెపి పార్టీలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జనసేన పార్టీతో పొత్తుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తారని ప్రతిపక్ష వైసిపి ఆరోపించే విషయం తెలిసిందే.
ఇక రాష్ట్రపతి ఎన్నికల ద్వారా మరోసారి బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టిడిపి మద్దతు ప్రకటించింది. నిన్న (మంగళవారం) రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము ఏపీ పర్యటన సందర్భంగా టిడిపి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసారు. దేశంలొనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని ఓ గిరిజన మహిళకు ఎంపికచేసారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశంసించారు.