డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే... వైజాగ్ కు మహర్దశ
భాతర దేశంలో కాదు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటుచేసేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ సిద్దమయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం కూడా పూర్తయ్యింది... భూకేటాయింపులు, ఇతర అనుమతులు కూడా పూర్తయ్యాయి.
ఇక రిలయన్స్ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్దమయ్యింది. ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తుండటంతో రాబోయే కొన్నేళ్లలో విశాఖ డేటా సెంటర్ హబ్ గా మారనుంది. భారీ పెట్టుబడితో లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విశాఖ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ లో డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం విశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. 2047 వరకు డేటా సెంటర్లకు పన్ను రాయితీలు కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు తరలిరానున్నాయి. కాబట్టి ఈ నగరం ఐటీ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్ రంగాల్లో మరింత దూసుకుపోనుంది.
ట్యాక్స్ మినహాయింపుతో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు విశాఖకు తరలివచ్చే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు సాగుతోంది... విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దీంతో విశాఖలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమే కాదు రియల్ ఎస్టేట్ కూడా మరింత ఊపందుకోనుంది.