13 Months Maternity Leave: ఏపీలో తగ్గుతున్న జనాభా పెరుగుదల రేటును అరికట్టేందుకు సీఎం చంద్రబాబు 'జనాభా నిర్వహణ విధానం' ప్రకటించారు. మూడో బిడ్డకు జన్మనిస్తే ₹25,000 నగదు ప్రోత్సాహకం, ఉచిత విద్య, తల్లిదండ్రులకు 13 నెలల ప్రత్యేక సెలవులు కల్పించనున్నారు.
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మూడో బిడ్డ పుడితే 13 నెలల పెయిడ్ లీవ్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విప్లవాత్మకమైన అడుగు వేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా "జనాభా నిర్వహణ విధానం" (Population Management Policy) ముసాయిదాను తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన మనం, ఇప్పుడు జనాభా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ క్రమంలో మూడో బిడ్డను కనే దంపతులకు భారీ ఆఫర్లను ప్రభుత్వం ప్రకటించింది.
25
13 నెలల సెలవులు : ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ఈ కొత్త పాలసీలో అందరినీ ఆకర్షించే అంశం సెలవులు. మూడో బిడ్డకు జన్మనిచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 12 నెలల ప్రసూతి సెలవులు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి అదనంగా, తండ్రికి కూడా బాధ్యతల్లో భాగస్వామ్యం కల్పించేందుకు 2 నెలల పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నారు. అంటే దంపతులకు కలిపి దాదాపు 13 నెలలకు పైగా సెలవులు లభించే అవకాశం ఉంది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉండి, ముగ్గురు పిల్లలు ఉన్న ఉద్యోగులకు 15 రోజుల 'వెల్నెస్ లీవ్' తో పాటు ₹50,000 హెల్త్ ఫండ్ కూడా ఇవ్వనున్నారు.
35
నగదు ప్రోత్సాహకం.. ఆర్థిక భరోసా
రెండో లేదా మూడో బిడ్డకు జన్మనిచ్చే కుటుంబాలకు ప్రభుత్వం ₹25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనుంది. 'పోషణ-శిక్ష-సురక్ష' ప్యాకేజీ కింద ఈ మొత్తాన్ని అందజేస్తారు. అంతేకాకుండా, మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు ప్రతి నెలా ₹1,000 పోషకాహార భృతి లభిస్తుంది. పాఠశాల దశకు వచ్చిన తర్వాత 'తల్లికి వందనం' పథకం కింద ఇచ్చే ₹15,000 సహాయం పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
జనాభా పెరుగుదలను ప్రోత్సహించే క్రమంలో, మూడో బిడ్డకు 18 ఏళ్ల వయసు వరకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ పద్ధతిలో రాయితీ ధరలకే ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం 'మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లను ఏర్పాటు చేయనున్నారు. అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించి, సహజ ప్రసవాలను ప్రోత్సహించడం కూడా ఈ పాలసీలో భాగం.
55
పడిపోతున్న ఫెర్టిలిటీ రేటుపై ఆందోళన
1993లో ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 3.0 ఉండగా, ప్రస్తుతం అది 1.4 - 1.5కి పడిపోయింది. జనాభా సమతుల్యత కోసం ఇది కనీసం 2.1 ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 23 శాతానికి చేరుతుందని, యువ శక్తి తగ్గి జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలలాగే ఏపీ కూడా ఆర్థిక సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం వృద్ధి సాధించాలంటే మహిళా ఉపాధి రేటును 31 శాతం నుండి 59 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మహిళా రక్షణ కోసం మరిన్ని మౌలిక సదుపాయాలు
మహిళా ఉద్యోగుల కోసం విశాఖపట్నంలో ₹172 కోట్లతో భారీ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ను నిర్మించనున్నారు. ఎక్కడైతే 50 కంటే ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉంటారో అక్కడ చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. మహిళల రక్షణ కోసం షీ క్యాబ్స్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా పాలసీపై నెల రోజుల పాటు ప్రజల్లో చర్చ జరగాలని, ఏప్రిల్ 1 నుండి దీనిని అధికారికంగా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.