Published : Jul 28, 2025, 06:25 PM ISTUpdated : Jul 28, 2025, 06:27 PM IST
యూఏఈకి చెందిన ప్రముఖ షాపింగ్ మాల్స్ సంస్థ లులు గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడతో పాటు విశాఖపట్నంలో లులు గ్రూప్కు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం బీచ్ రోడ్లోని హార్బర్ పార్క్ ప్రాంతంలో APIICకు చెందిన 13.74 ఎకరాల భూమిని లులు ఇంటర్నేషనల్ గ్రూప్కు కేటాయించింది. ఈ భూమిని 99 సంవత్సరాల లీజు పద్ధతిలో ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ నిర్మాణం జరగనుంది.
25
విజయవాడలో రెండో ప్రాజెక్ట్కు ఆమోదం
విజయవాడలో కూడా లులు గ్రూప్కు 4.15 ఎకరాల భూమి కేటాయింపుకు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ భూమి మీద 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ అభివృద్ధి చేయనున్నారు. ఈ భూమిని 65 సంవత్సరాల లీజుతో ఇస్తారు. అవసరమైతే మరింత 33 సంవత్సరాల పాటు పొడిగించే అవకాశం ఉంది.
35
GO 137 ద్వారా ఉత్తర్వులు
ఇండస్ట్రీస్, కామర్స్ శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఆదివారం GO Ms No.137ను జారీ చేశారు. ఇందులో విశాఖపట్నం హార్బర్ పార్క్ భూములపై APIIC అధికారాన్ని పునరుద్ధరించి, లులు గ్రూప్ ప్రతిపాదనను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
APIIC మేనేజింగ్ డైరెక్టర్ను భూమిపై ఉన్న కోర్టు కేసులు, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రాజెక్ట్ త్వరితగతిన అమలుకావడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ భూమికి 99 ఏళ్ల లీజు ఉండగా, మూడు సంవత్సరాల అద్దె మినహాయింపు లేదా మాల్ ప్రారంభం వరకు మినహాయింపు ఇస్తారు. విజయవాడ ప్రాజెక్ట్కి కూడా మూడు సంవత్సరాల అద్దె మినహాయింపు వర్తిస్తుంది.
55
రవాణా శాఖ, APSRTCకు సూచనలు
భూములపై ఉన్న రవాణా శాఖ, APSRTC నిర్మాణాలను జిల్లా కలెక్టర్ గుర్తించిన ప్రత్యామ్నాయ భూములకు తరలించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అనంతరం, ఆ భూములను పర్యాటక శాఖకు అప్పగించనున్నారు. భూముల ధరలు AP టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2024–2029 ప్రకారం నిర్ణయిస్తారు.