దేశ భవిష్యత్ సాంకేతిక దిశను నిర్ణయించే కీలక ఘట్టం అమరావతిలో ప్రారంభమైంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో రూపొందించిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ ప్రాజెక్ట్కు అధికారికంగా శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఈ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి పునాది రాయి వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం 50 ఎకరాల భూమిని కేటాయించింది.
25
భారత తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ లక్ష్యం
అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేకత ఏమిటంటే… భారతదేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇక్కడ ఏర్పాటు కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్కు ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు సాంకేతిక భాగస్వాములుగా ముందుకు వచ్చాయి. ఇది దేశీయ క్వాంటమ్ పరిశోధన రంగానికి కొత్త బాట వేయనుంది. కంప్యూటింగ్ సామర్థ్యంలో విప్లవాత్మక మార్పులకు ఇది పునాది అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
35
కీలక రంగాలకు క్వాంటమ్ శక్తి
ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రక్షణ రంగం, ఆరోగ్య సేవలు, ఫైనాన్స్ వంటి కీలక విభాగాల్లో పరిశోధనలు ఊపందుకోనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఇక్కడే అభివృద్ధి కానున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అమరావతి ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్ల సరసన నిలవనుంది. అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ టెక్ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షితమవుతాయి. స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరిస్తుంది. లక్షల మంది యువతకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ లభించే అవకాశం ఉంటుంది. పెద్ద స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టి కానున్నాయి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
55
సామాన్యుడి జీవితంలో జరిగే మార్పులివే
క్వాంటమ్ టెక్నాలజీ ప్రభావం నేరుగా సామాన్యుడి జీవితంలో కనిపించనుంది. ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కావడం, వ్యవసాయంలో వాతావరణ అంచనాలు కచ్చితంగా రావడం, నీటి వినియోగం సమర్థంగా మారడం, దిగుబడి అంచనాలు మెరుగవడం, బ్యాంకింగ్ లావాదేవీల భద్రత పెరగడం వంటి ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.